KRMB ; కృష్ణాబోర్డులో జీతాలకు పైసల్లేవు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:40 AM
కృష్ణా బేసిన్ పరిధిలోని జలాశయాల్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఖాతాల్లో నిధులు అడుగంటిపోయాయి. గత పదేళ్లలో మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, ఆరేళ్లపాటు తెలంగాణ ఒక్క రూపాయి కూడా బోర్డుకు ఇవ్వలేదు. దీంతో ఉన్న కొద్దిపాటి
జనవరి వేతనాలకు నిధుల కటకట
పట్టించుకోని 2 తెలుగు రాష్ట్రాలు
డబ్బుల్లేక అటకెక్కిన సర్వే ప్రతిపాదన
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్ పరిధిలోని జలాశయాల్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఖాతాల్లో నిధులు అడుగంటిపోయాయి. గత పదేళ్లలో మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, ఆరేళ్లపాటు తెలంగాణ ఒక్క రూపాయి కూడా బోర్డుకు ఇవ్వలేదు. దీంతో ఉన్న కొద్దిపాటి నిధులు ఖర్చయిపోయి, వచ్చే జనవరి నెలకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా బోర్డు వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితి. బోర్డులో ఛైర్మన్, సభ్యులు తప్ప మిగిలిన వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులే. వీరందరి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ 2014 నుంచి 2018 వరకు, అనంతరం 2022-23, 2023-24లలో కేఆర్ఎంబీకి నిధులు ఇవ్వలేదు. 2019-20, 2020-21, 2022-23లలో ఏపీ ప్రభుత్వం ఒక్కపైసా కూడా బోర్డుకు అందజేయలేదు. 2023-24 బడ్జెట్లో మాత్రం రూ.3.35 కోట్లను విడుదల చేసింది. తెలంగాణ ఏమాత్రం ఇవ్వలేదు. వాస్తవానికి, ప్రాజెక్టుల స్వాఽధీనానికి 2021 జూలై 15వ తేదీన గెజిట్ విడుదల చేసిన కేంద్రం, బోర్డుల నిర్వహణకు చెరో రూ.200 కోట్లను 60 రోజుల్లోగా (సెప్టెంబరు 14లోగా) ఇవ్వాలని స్పష్టం చేయగా... తెలుగు రాష్ట్రాలు ఆ ఆదేశాలను పాటించలేదు. జలాశయాల్లో ఏ మేర నీటి నిల్వలు ఉన్నాయి? ప్రాజెక్టుల సామర్థ్యమెంత? ఏ మేరకు పూడిక చేరింది?.. వంటి వివరాల సేకరణ కోసం సర్వే చేపట్టాలని కేఆర్ఎంబీ భావించింది. సర్వే కోసం పూణేలోని సీపీడబ్ల్యూఆర్ఎ్సతో సంప్రదింపులు కూడా జరిపింది. రూ.70 లక్షలు జమ చేస్తే కానీ సర్వే దిశగా అడుగు ముందుకు వేయలేమని ఆ సంస్థ తేల్చిచెప్పింది. అందుబాటులో ఉన్న నిధులన్నీ వేతనాలకే సరిపోవని... ఇక సర్వే ఎందుకు అని కేఆర్ఎంబీ కూడా ఆ ప్రతిపాదనలు పక్కనపెట్టింది. ప్రస్తుతం సర్వే కాదు కదా.. అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితిలో కేఆర్ఎంబీ లేదు.