ఆ నాలుగు ఎందుకు ఆపారు?
ABN , First Publish Date - 2023-08-22T03:52:30+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో సీఎం కేసీఆర్, నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు.
జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ పెండింగ్
అసంతృప్తి తగ్గాక జనగామపై ప్రకటన
నర్సాపూర్ నుంచి సునీత ఖాయం?
సీఎం మెదక్ పర్యటన తర్వాత ప్రకటన
మజ్లిస్తో స్నేహపూర్వక పోటీ కోసమే నాంపల్లిపై ఆలస్యం
ఈ నెల 25న పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన!
గోషామహల్లో బీజేపీ నుంచి నేనే.. రాజాసింగ్ ధీమా
జనగామ టికెట్ నాదే.. ముత్తిరెడ్డి
హైదరాబాద్, ఆగష్టు 21 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో సీఎం కేసీఆర్, నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాల్లో తమ అభ్యర్ధులు ఎవరన్నదానిపై త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్ సోమవారం నాటి విలేకరుల సమావేశంలో అన్నారు. ఫలితంగా ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించిన బీఆర్ఎస్.. కేవలం ఈ నాలుగు స్థానాలను ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసిన తర్వాత పార్టీ అభ్యర్ధి ఎవరన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని అంతర్గతంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న సునీతాలక్ష్మారెడ్డిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై బీఆర్ఎస్ యోచిస్తోంది. నర్సాపూర్ స్థానానికి తమ అభ్యర్ధి ఎవరన్నదానిపై సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ పర్యటన అనంతరం స్పష్టతనివ్వనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ తరపున జనగామ నుంచి తమ అభ్యర్థి ఎవరన్నదానిపైనా కేసీఆర్ స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై పలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆరే పల్లా రాజేశ్వరరెడ్డిని జనగామ నుంచి పోటీ చేయాలని సూచించారని, అందుకే పల్లా జనగామ నేతలతో హైదరాబాద్లో సమావేశమయ్యారని తెలుస్తోంది.
ప్రస్తుతం నెలకొన్న అసంతృప్తి చల్లారాక దీనిపై ప్రకటన చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. నర్సాపూర్, జనగామ స్థానాల విషయంలో అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్ధులను ప్రకటించని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లాలోని గోషామహల్, నాంపల్లి స్థానాల్లోనూ తమ అభ్యర్ధులు ఎవరన్నదానిని ప్రకటించలేదు. నాంపల్లి సెగ్మెంట్ ప్రస్తుతం మజ్లిస్ ఖాతాలో ఉంది. వాస్తవానికి ఇక్కడ మజ్లిస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ పలుమార్లు పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలవుతున్నారు. ఈసారి కూడా కాంగ్రె్సకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మజ్లి్సతో స్నేహపూర్వక పోటీ కోసం ఇక్కడ బీజేపీ తరఫున అభ్యర్థి ఎవరు? అనేదానిపై ఓ అంచనాకు వచ్చాక తమ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేయడంతో గోషామహల్ను ఈసారి ఎలాగైనా ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇక్కడ పోటీకి గ్రంఽథాలయం సంస్థల మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్, నందకిషోర్ వ్యాస్, అడ్వొకేట్ రాజశేఖర్, మమత సంతోష్ గుప్తా టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే అసంతృప్తులు భగ్గుమంటాయన్న అంచనాతోనే గోషామహల్ను పెండింగ్లో పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25న అన్ని పెండింగ్ స్థానాలను బీఆర్ఎస్ ప్రకటించనుంది. గోషామహల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది మజ్లిస్ నిర్ణయిస్తుందని బీజేపీ బహిష్కృతనేత, సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.
సీఎంను పల్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు
జనగామ టికెట్ ఈసారి కూడా తనకే దక్కుతుందని సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి.. తన కుటుంబ విషయాలను, లేనిపోని అంశాలను బూచిగా చూపి సీఎం కేసీఆర్ను కన్ఫ్యూజ్ చేశారని పేర్కొన్నారు. తన విషయంలో జరుగుతున్న ప్రచారంపై పూర్తి స్పష్టత కోసమే జనగామ టికెట్ను కేసీఆర్ పెండింగ్లో పెట్టారని అభిప్రాయపడ్డారు.