నోట్ల గుట్టలు ఎవరివి?
ABN , First Publish Date - 2023-12-11T03:36:46+05:30 IST
: ఝార్ఖండ్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూ ఇంట్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.290 కోట్ల నగదు ఎక్కడిదో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
పార్లమెంటు ఎన్నికల కోసం దాచారా
ధీరజ్ సాహూ మీ సన్నిహితుడు కాదా
రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూ ఇంట్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.290 కోట్ల నగదు ఎక్కడిదో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమ సంపాదన బయటపడటం దేశ చరిత్రలో తొలిసారి అని.. ఈ ఖ్యాతి కాంగ్రె్సకే దక్కుతుందని పేర్కొన్నారు. నోట్ల కట్టలను లెక్కపెట్టలేక యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహూ అని కిషన్రెడ్డి వెల్లడించారు. రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారని, ఆ డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టలా..? అని నిలదీశారు. ఎక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ బ్లాక్ మనీ బయటపడుతోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయినా ధీరజ్ సాహూకు మూడుసార్లు రాజ్యసభ పదవి ఎలా ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు ఆయనే అన్నీ సమకూర్చారని ఆరోపించారు. సీఎంలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలుగా మారిపోయారని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ అంతా కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల అమలుకే సరిపోతోందని.. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. వ్యాపారవేత్తలు, బిల్డర్లను దోచుకుంటున్నారని ఆరోపించారు. వారి దోపిడీని తట్టుకోలేక కర్ణాటక వ్యాపారవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని.. ఇదీ కాంగ్రెస్ మార్క్ అవినీతి అని కిషన్రెడ్డి విమర్శించారు.