మేం కక్ష సాధించలే
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:50 AM
తాము కక్ష సాధించాలనుకుంటే సగం మంది కాంగ్రెస్ నాయకులు ఈ పాటికి జైల్లో ఉండేవారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
అలా చేస్తేసగం మంది కాంగ్రెస్
నాయకులు స్కామ్లలో జైల్లో ఉండేవారు
కేసీఆర్కు పనితనమే తప్ప పగతనం లేదు
నర్సాపూర్ సభలో హరీశ్రావు వ్యాఖ్యలు
కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ
నర్సాపూర్, డిసెంబరు 13: తాము కక్ష సాధించాలనుకుంటే సగం మంది కాంగ్రెస్ నాయకులు ఈ పాటికి జైల్లో ఉండేవారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనమే తప్ప పగ అంటే తెలియని గొప్ప మనిషని పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఆర్ఎస్ ఆఽధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో హరీశ్రావు మాట్లాడుతూ, కేసీఆర్కు ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసే తపనే తప్ప ఇతరులపై కక్షలు, కుట్రలు సాధించాలనే సోయి లేదని అన్నారు. ఆయన అలాంటి వాడైతే తమ పదేళ్ల పాలన కాలంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ పాటికి జైలులో ఉండేవారని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ స్కామ్లో ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో సగం మంది జైలులో ఉండేవారని అన్నారు. బీఆర్ఎ్సకు ఇది ఇది ఓ స్పీడ్ బ్రేక్ మాత్రమే అని తాత్కాలికంగా వేగం తగ్గొచ్చు కాని భవిష్యత్తు తమ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలెవరూ ఓటమికి కుంగిపోవద్దని అందరం సమష్టిగా పనిచేసి రానున్న ఎన్నికలలో విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అధికారపక్షం వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందని దానికి భయపడొద్దని అన్నారు. కార్యకర్తలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని హరీశ్రావు వారికి హామీ ఇచ్చారు.