Share News

లాండ్‌ క్రూయిజర్లు కొన్నాం.. తప్పేముంది?

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:46 AM

‘‘గతంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాకే.. లాండ్‌ క్రూయిజర్‌ వాహనాలు కొన్నాం.. అందులో తప్పేముంది..

లాండ్‌ క్రూయిజర్లు  కొన్నాం.. తప్పేముంది?

కేసీఆర్‌ సొంతానికి కాదుగా: కడియం శ్రీహరి

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాకే.. లాండ్‌ క్రూయిజర్‌ వాహనాలు కొన్నాం.. అందులో తప్పేముంది.. దాని గురించి సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నారు’’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్‌ఎ్‌సఎల్పీలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. లాండ్‌ క్రూయిజర్‌ వాహనాలను కొంటే తప్పేముందని, అవి కేసీఆర్‌ సొంతానికి కొన్నారా? ఆ వాహనాల్లో ఈ ప్రభుత్వం వాళ్లు తిరగరా? అని ఆయన ప్రశ్నించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కోసం వాహనాలను విజయవాడకు తరలించడం పరిపాటే అని, అది దాచే విషయం ఏమీ కాదన్నారు. సచివాలయంలో డబ్బులుంటాయా? ఏ సీఎం అయినా సచివాలయంలో లంకెబిందెలు ఉన్నాయని వస్తారా? అసలు రాత్రి పూట లంకె బిందెల కోసం తిరిగేవారిని ఏమంటారో అందరికి తెలుసని కడియం ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ తెలిసే.. ప్రస్తుత ముఖ్యమంత్రి హామీలిచ్చారా? అని నిలదీశారు. 412 హామీలిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కారు.. నిధులు సమీకరించలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే శ్వేతపత్రాలు, న్యాయ విచారణల పేరిట నాటకాలాడుతోందని మండిపడ్డారు. కాళేశ్వరంపై మంత్రుల పర్యటనతో తాము చెప్పిన వాస్తవాలు వెలుగు చూశాయని, ఆ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న వారే.. పీపీటీలో రూ.93 వేల కోట్లు ఖర్చయిందని చెప్పారన్నారు. వారిచ్చిన నివేదికలోనే 90 వేల ఎకరాల ఆయకట్టు వచ్చినట్లు పేర్కొన్నారని ఆయన తెలిపారు.

Updated Date - Dec 30 , 2023 | 02:46 AM