సెల్‌ఫోన్ల వల్ల సున్నితత్వం కోల్పోతున్నాం

ABN , First Publish Date - 2023-06-01T01:00:49+05:30 IST

కవులు సమాజ హితం కోసం సాహిత్య సృష్టి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బుధవారం నిజామాబాద్‌లో నిర్వహించిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడారు.

సెల్‌ఫోన్ల వల్ల సున్నితత్వం కోల్పోతున్నాం

ఢిల్లీలో బాలికను చంపుతుంటే చూసి కూడా ఆపలేదు

పుస్తక పఠనంతోనే మానవత్వాన్ని కాపాడుకోగలం

సమాజ హితం కోసం సాహిత్య సృష్టి చేయాలి

కవులు, రచయితలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు

నిజామాబాద్‌ కల్చరల్‌/నిజామాబాద్‌, మే 31: కవులు సమాజ హితం కోసం సాహిత్య సృష్టి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బుధవారం నిజామాబాద్‌లో నిర్వహించిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన దాశరథి, వట్టికోట ఆళ్వార్‌స్వామిలను స్ఫూర్తిగా తీసుకుని రచయితలు పని చేయాలన్నారు. ‘‘ఆనాడు ఇందూరు జైలు గోడల మీద దాశరథి బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే మాట యావత్‌ తెలంగాణ ఉద్యమానికి బాట చూపించింది. అలాంటి రచయితల స్మృతులను ఎల్లకాలం నిలిపి ఉంచాలన్న ఉద్దేశంతో ఇందూరు జైలును తీర్చిదిద్దుతున్నాం. ఇందుకు ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.40లక్షలు ఖర్చు చేస్తున్నాం’’ అని కవిత ఈ సందర్భంగా తెలిపారు. దాశరథి జయంతి అయిన జూలై 22న జైలు వద్ద దాశరథి స్మృతి వనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో ఒక ఆడపిల్లను పొడిచి, బండతో మోది చంపేస్తే చుట్టుపక్కల ఉన్నవారు చూస్తూ వీడియోలు తీశారే తప్ప ఆపలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్‌ వచ్చాక మనుషుల్లో సున్నితత్వం లోపించిందన్నారు. మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న ఏ అంశాన్నైనా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అది సాహిత్యంతోనే జరుగుతుందనే విశ్వాసం తనకుందని అన్నారు. పిల్లలతో పుస్తకాలను చదివించాలని, లేకపోతే వారు స్పందించే గుణాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-01T01:00:49+05:30 IST