వైభవంగా వీరభద్రేశ్వర స్వామి కల్యాణోత్సవం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:23 PM
మండల పరిధిలోని పూడూరు గ్రామంలో వీరభద్రస్వామి స్వామి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.
- ఘనంగా బోనంకాగు ఊరేగింపు, రాత్రి రథోత్సవం
గద్వాల, డిసెంబరు 17: మండల పరిధిలోని పూడూరు గ్రామంలో వీరభద్రస్వామి స్వామి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం పంచామృతసేవ, గణపతి పూజ అనంతరం ఆలయంలో వీరభద్రేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు రాజవంశస్థులు డాక్టర్ విక్రమసింహారెడ్డి, డాక్టర్ సుహాసినిరెడ్డి దంపతులు కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో వంశపారంపర ధర్మకర్తలు ఉషారాణి, సంయుక్తమ్మలతో పాటు చెన్నకేశవరెడ్డి, సర్పంచు శశికళ లక్ష్మీకాంతారెడ్డి దంపతులు, మాజీ సర్పంచు అచ్చన్న గౌడ్ దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం 5గంటలకు కాళికామాత ఆలయం నుంచి భోనం కాగును పురవీధుల గుండా ఊరేగించారు. 7గంటలకు ఆలయంలోకి చేర్చారు. తర్వాత రాత్రి 8గంటలకు భాజా భజంత్రీలతో శ్రీ వీరభద్ర స్వామి వారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. ప్రతీ ఇంటి ముందు పెద్దపెద్ద శామియానాలను వేసుకొని బంధువులు, స్నేహితుల సమక్షంలో జాతర ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. సోమవారం రంగోత్సవం, నందికోల సేవ, పల్లకీ సేవ, నాగవల్లి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తిమ్మప్ప గౌడ్, వెంకట్రెడ్డి, మోహన్రెడ్డి తెలిపారు.