Asifabad ROADS : దారీతెన్నూలేని ఏజెన్సీ!

ABN , First Publish Date - 2023-06-02T02:44:18+05:30 IST

వర్షాలకు అరకొర రోడ్లు జలమయమై, రహదారులు లేని చోట్ల డొంక దారులు ముంపునకు గురై గిరిజనులు నానా ఇక్కట్లు పడుతున్నారు.

Asifabad  ROADS : దారీతెన్నూలేని ఏజెన్సీ!

గిరిజన గూడేలకు డొంకదారులే దిక్కు..

ఇంకా రోడ్డుకు నోచుకోని 398 ఆవాసాలు

ఏడేళ్లుగా ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలే..

ఆసిఫాబాద్‌ జిల్లాలో గిరిజనుల వెతలు

ఆసిఫాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): వర్షాలకు అరకొర రోడ్లు జలమయమై, రహదారులు లేని చోట్ల డొంక దారులు ముంపునకు గురై గిరిజనులు నానా ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. చిన్న చిన్న వాగులు, వంకలతో రోడ్లన్నీ జలమయమై వర్షాకాలం ప్రత్యక్ష నరకాన్ని చూపించడం ఇక్కడ సర్వసాధారణం. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ రోడ్డు ఆనవాళ్లు లేని ఆవాసాలు అనేకం ఉన్నాయి. కనీసం కాలినడకన కూడా వెళ్లే పరిస్థితులు లేక పోవడంతో జిల్లాలో ఏజెన్సీ వాసులు రోజువారి అవసరాల నిమిత్తం సమీప పట్టణాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఏయేటికాయేడు రోడ్ల నిర్మాణం కోసం కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నా ఆచరణకు వచ్చేసరికి నిధుల కొరత, అటవీ నిబంధనల కొర్రీలు అడ్డంకిగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 398 ఆవాసాలకు కనీసం రోడ్ల ఆనవాళ్లే లేని పరిస్థితులు ఉంటే 442 రెవెన్యూ గ్రామాల్లో పక్కా రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని అర్‌ అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. గడచిన ఏడేళ్లుగా అధికారులు ప్రతిపాదనలు పంపటం, ప్రభుత్వం వాటిని బుట్ట దాఖలు చేయడం షరా మామూలు వ్యవహారంగా మారిపోయింది.

2knr1.jpg

వానాకాలంలో ఇక్కడ నడక నరకం..

ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గల 15 మండలాలు, 334 గ్రామ పంచాయతీల్లో గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యం అందని ద్రాక్షలాగే ఊరిస్తోంది. పూర్తి అటవీ ప్రాంతం కావడం, చిన్న చిన్న గిరిజన గ్రామాలు కావడం వల్ల ప్రభుత్వాలు కూడా ఆయా గ్రామాలపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొని ఉంది. ఫలితంగా గిరిజన గూడేలు నాగరికతకు నోచుకోక అభివృద్ధికి దూరంగా సమస్యలతో సతమతమవుతున్నాయి. జిల్లా ఏర్పడిన తరువాత మారుమూల గ్రామాల రోడ్ల దశ మారుతుందేమోనని ప్రజలు ఆశించారు. అడపా దడపా అత్తెసరు నిధులు మాత్రమే విదిల్చడంతో రోడ్ల దుస్ధితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారయింది. ముఖ్యంగా గిరిజన ప్రాం తాలన్నింటినీ కలుపుతూ రోడ్డు నెట్‌వర్కును అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యా యి.

సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ 126 గ్రామాలకు కాలినడకన కూడా ప్రయాణించే సౌకర్యమే దిక్కు లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఊహించవచ్చు. ఈ నియోజకవర్గంలోని 5మండలాల పరిధిలో 300 కి.మీ. మేర ఇప్పటికీ గుంతలు, బురదమయం అయిన మట్టి రోడ్లపైనే ప్రయణించాలి. ఆయా రోడ్లను బీటీలుగా మార్చేందుకు ఏళ్లతరబడి ప్రతిపాదనలు పంపుతున్నా మోక్షం లభించలేదు. గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో సుమారు 144కి.మీ.నిడివి గల రహదారులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టేందుకు పరిపాలన పరమైన మంజూరు లభించింది. ప్రస్తుతం ఇవి నిర్మాణ దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కాకూండా మరో 200 రెవెన్యూ, గ్రామాలకు, గూడేలకు మట్టి రోడ్లు కూడా లేని పరిస్ధితి ఉందంటున్నారు. ఇక ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, లింగాపూర్‌, తిర్యాని మండలాల్లో పంచాయతీలు, గ్రామాలు, ఆదివాసీ గూడాలు అన్నీ కలుపుకుంటే మరో 198 గ్రామాలకు మట్టి, బీటీ రోడ్లుగా అబివృద్ధి చేయాల్సిన పరిస్ధితి ఉందని చెబుతున్నారు.

మట్టి రోడ్లకే 300 కోట్లు అవసరం..

ఆసిఫాబాద్‌ జిల్లాలో రహదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే తక్కువలో తక్కువగా కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని పంచాయతీరాజ్‌ ఇంజనేరింగ్‌ అంచనా వేస్తోంది. ఈ నిధులు మట్టి రోడ్ల నిర్మాణానికి మాత్రమే సరిపోతాయని అంటున్నారు. ఇవి కాకుండా ఇప్పటికే ప్రతిపాదించిన రోడ్ల అభివృద్ధికి(బీటీ రోడ్లుగా మార్చడం కోసం) మరో రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా వే శారు. అయితే ఈ ప్రతిపాదనలకు నాలుగేళ్లుగా మోక్షం లభించలేదు. ప్రతీ ఏటా వర్షాకాలంలో మట్టిరోడ్లు నామరూపాల్లేకుండా ధ్వంసం అవుతున్న పరిస్థితి కొనసాగుతుండడంతో పక్కా రోడ్లు నిర్మించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అధికారులు గుర్తించి గతంలోనే రూ.500 కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు.

Updated Date - 2023-06-02T03:10:36+05:30 IST