తెలంగాణకు చెందిన ఇద్దరు సహా ఐదుగురు హైకోర్టు జడ్జిల బదిలీ
ABN , First Publish Date - 2023-11-14T04:02:28+05:30 IST
దేశంలో అయిదుగురు హైకోర్టు జడ్జీలు బదిలీ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఽఘ్వాల్ సోమవారం ఎక్స్ ద్వారా తెలిపారు. వీరిలో తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ సుమలత,
జస్టిస్ సుమలత కర్ణాటకకు.. జస్టిస్ సుధీర్ కుమార్ మద్రాసుకు
న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో అయిదుగురు హైకోర్టు జడ్జీలు బదిలీ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఽఘ్వాల్ సోమవారం ఎక్స్ ద్వారా తెలిపారు. వీరిలో తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ సుమలత, జస్టిస్ ముమ్మినేని సుధీర్కుమార్ ఉన్నారు. జస్టిస్ సుమలత కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ సుధీర్కుమార్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. వాస్తవానికి ఆగస్టు 10న తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు జడ్జిలను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. అందులో జస్టిస్ అనుపమా చక్రవర్తి, జస్టిస్ ఎం. లక్ష్మణ్ బదిలీకి ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న ప్రస్తుత ఇద్దరు జడ్జీల బదిలీ ప్రతిపాదనను కేంద్రం సోమవారం ఆమోదించింది. తెలంగాణ హైకోర్టులో మొత్తం జడ్జిల సాంక్షన్డ్ స్ర్టెంత్ 42 కాగా ప్రస్తుతం 28 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరి బదిలీలతో ఈ సంఖ్య 26కు పడిపోగా.. 16 ఖాళీలు ఉన్నాయు. వీరు కాకుండా అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేశారు. కలకత్తా హైకోర్టు నుంచి ఇద్దరు బదిలీ కాగా, వారిలో జస్టిస్ శేఖర్ బి సరాఫ్ అలహాబాద్కు, జస్టిస్ బిబేక్ చౌధురి పట్నాకు వెళ్లనున్నారు.