రేపే హైదరాబాద్కు చే గువేరా కుమార్తె, మనుమరాలు
ABN , First Publish Date - 2023-01-21T02:39:11+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ప్రభావితం చేసిన గెరిల్లా యోధుడు, క్యూబన్ విప్లవకారుడు, ప్రఖ్యాత మార్క్సిస్టు నాయకుడు చే గువేరా కుమార్తె డా. అలైదా గువేరా, మనుమరాలు ప్రొ. ఎస్తేఫానియా గువేరా ఆదివారం హైదరాబాద్కు రానున్నారు.
క్యూబా సంఘీభావ సభలో ప్రసంగించనున్న అతిథులు
హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ప్రభావితం చేసిన గెరిల్లా యోధుడు, క్యూబన్ విప్లవకారుడు, ప్రఖ్యాత మార్క్సిస్టు నాయకుడు చే గువేరా కుమార్తె డా. అలైదా గువేరా, మనుమరాలు ప్రొ. ఎస్తేఫానియా గువేరా ఆదివారం హైదరాబాద్కు రానున్నారు. వారు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈనెల 22వ తేదీన వారు రవీంద్రభారతిలోని సదస్సులో పాల్గొంటారని క్యూబా సంఘీభావ జాతీయ స్థాయి కమిటీ సమన్వయకర్త డీజీ నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, విశ్రాంత ఐఏఎస్ కాకి మాధవరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, ప్రొ. కె. నాగేశ్వర్ తదితరులు పాల్గొననున్నారు. అనంతరం జనవరి 23న విజయవాడలో జరిగే బహిరంగ సభకు వారు హాజరవ్వనున్నారు.
భారత ప్రజలతో మాట్లాడాలనే తపనతో..
అంతర్జాతీయ పరిస్థితులపై భారత ప్రజలతో సంభాషించాలనే తలపుతో తన కుమార్తెతో కలిసి 63ఏళ్ల అలైదా గువేరా జనవరి 4న భారత్కు వచ్చారు. వారిని కేఆర్ గౌరీ అమ్మ స్మారక పురస్కారంతో కేరళ ప్రభుత్వం సత్కరించింది. అనంతరం తమిళనాడు, కర్ణాటక, కోల్కతాలోని పలు సదస్సుల్లో పాల్గొన్నారు. జనవరి 24న ఢిల్లీలోని మరొక సభలో పాల్గొని, జనవరి 27న హవానాకు తిరుగు ప్రయాణం అవుతారని క్యూబా సంఘీభావ కమిటీ సభ్యులు తెలిపారు. కాగా, చే గువేరా 1959లో తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు, అప్పటి ప్రధాని నెహ్రూ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన కుమార్తె, మనుమరాలు భారత పర్యటనకు విచ్చేయగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి కనీస స్పందన వెలువడలేదని క్యూబా సంఘీభావ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.