'CPI Prajagarjana' : నేడు ‘సీపీఐ ప్రజాగర్జన’ సభ
ABN , First Publish Date - 2023-06-11T02:56:18+05:30 IST
కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో పాటు రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ‘సీపీఐ ప్రజాగర్జన’ బహిరంగ సభను ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించనున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథిగా
హైదరాబాద్, కొత్తగూడెం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో పాటు రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ‘సీపీఐ ప్రజాగర్జన’ బహిరంగ సభను ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించనున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథిగా ఈ బహిరంగసభకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గసభ్యుడు చాడవెంకట్రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఈ సభను నిర్వహించనున్నారు. లక్ష మందికి తగ్గకుండా సభను నిర్వహించేలా సీపీఐ రాష్ట్రనాయకత్వం పట్టుదలతో కృషి చేస్తోంది. సభకు ప్రత్యేక రైలు ద్వారా సీపీఐ కార్యకర్తలు తరలిరానున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో సీపీఐకి ప్రాతినిధ్యం కల్పించాలన్న తలంపుతో ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధిష్టానంతో వామపక్షాలకు తలో రెండు సీట్లైనా కేటాయించాలని చర్చలు జరిగినట్లు వార్తలు రాగా..ఇప్పుడు ఆ సీట్లు కూడా గులాబీ పార్టీ ఇచ్చే స్థితిలో లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించి గులాబీ దళపతికి తమ బలం చూపెట్టాలని సీపీఐ భావిస్తోంది.