ఆ 23 గ్రామాలు 1/70 చట్టం పరిధిలోకి
ABN , First Publish Date - 2023-07-06T03:17:04+05:30 IST
ములుగు జిల్లా మంగపేట మండలం రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
మంగపేట ఐదో షెడ్యూల్లోదే..
తీర్పును వెల్లడించిన హై కోర్టు
సింగిల్ జడ్జి తీర్పునకు సమర్థన
గిరిజనేతరుల పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్, ములుగు, జూలై 5(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా మంగపేట మండలం రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. ఈ మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ ప్రాంతం (గిరిజన) కిందకే వస్తాయని స్పష్టం చేసింది. 25 పంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాల్లో సర్వ హక్కులు ఆదివాసీలకే ఉంటాయని చెప్పింది. కాగా, ఈ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంగా రాష్ట్రపతి గుర్తించలేదంటూ 2013లో మర్రి వెంకటరాజం, పలువురు గిరిజనేతర వర్గాల ప్రజాపత్రినిధులు పిటిషన్లు వేశా రు. ఐదో షెడ్యూల్ పేరా 6(1)లో ఈ ప్రాంతాన్ని చేర్చలేదని.. అయినప్పటికీ స్థానిక సంస్థల్లో గిరిజనులకే మొత్తం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. దీనిని కొట్టివేయాలని కోరారు. 2014లో జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం గిరిజనులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, గిరిజనేతర నాయకులు అదే ఏడాది డివిజన్ బెంచ్లో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం బుధవారం తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ.. అప్పీల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పుతో ము లుగు జిల్లాలో పూర్తిస్థాయి గిరిజన మండలంగా మంగపేట అవతరించింది. ఇక్కడ ఎన్నికలు, సొసైటీల ఏర్పాటు ఐదో షెడ్యూల్ పరిధిలోనే జరుగుతాయి. 1/70 చట్టం పూర్తిగా అమల్లోకి రానుంది. భూ బదలాయింపుపై నిషేధం కొనసాగుతుంది. మంగపేట మండల వివాదం 1973 నుంచి కోర్టులో నడుస్తోంది. కొన్నిసార్లు ఆదివాసీలు, ఇంకొన్నిసార్లు గిరిజనేతరులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. గిరిజనేతరులతో పాటు తాము కూడా హక్కులు కోల్పోతున్నామంటూ ఎస్సీలు 2016లో కోర్టులో పిటిషన్ వేశారు. 2022 ఆగస్టులో తుది విచారణ తర్వాత తీర్పు రిజర్వులో ఉంది. మరోవైపు గతంలో గిరిజనుల పక్షాన హైకోర్టులో ప్ర ముఖ న్యాయవాదులు బొజ్జా తారకం, జె.సత్యప్రసాద్, ప్రస్తుతం చిక్కు డు ప్రభాకర్ వాదించారు. గిరిజన, ఆదివాసీలకు సంపూర్ణ న్యాయం జరిగిందని తీర్పు అనంతరం ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ, అటవీ హక్కులు, భూ బదలాయింపు చట్టాలు, ఎన్నికల్లో రిజర్వేషన్లు ఆదివాసీలకే లభిస్తాయన్నారు.