మా 6 గ్యారెంటీలకు వారే బ్రాడ్‌ అంబాసిడర్లు

ABN , First Publish Date - 2023-10-03T03:48:09+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితలు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

మా 6 గ్యారెంటీలకు వారే బ్రాడ్‌ అంబాసిడర్లు

కేటీఆర్‌, హరీశ్‌, కవితను అధికారంలోకి వచ్చాక సన్మానిస్తాం: మల్లు రవి

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితలు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక, వంద రోజుల్లోనే వారికి సన్మానం చేస్తామన్నారు. తమ హామీలను ప్రచారంలోకి తీసుకొస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసిందని, ఈ ఆరు గ్యారెంటీలనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసి తీరుతుందని మల్లు రవి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇచ్చిన భూములను ప్రభుత్వ అవసరాల పేరుతో లాక్కుని, పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడాన్ని నిరసిస్తూ గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద కిసాన్‌ కాంగ్రెస్‌ దీక్ష నిర్వహించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన ఈ దీక్షలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పార్టీ నేతలు మధుయాష్కీగౌడ్‌, వి. హన్మంతరావు, రాములునాయక్‌, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, దివంగత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో వారి చిత్రపటాలకు కాంగ్రెస్‌ నేతలు ఘన నివాళులు అర్పించారు. అలాగే గాంధీభవన్‌ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేశారు.

Updated Date - 2023-10-03T03:48:09+05:30 IST