చెల్లెళ్లకు భూమి రాసిచ్చాడని.. తండ్రిని కడతేర్చిన తనయుడు
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:40 AM
చెల్లెళ్లకు భూమి రాసిచ్చాడనే కోపంతో కన్న తండ్రిని కర్రతో కొట్టి హతమార్చాడో కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ జిల్లా సిరిసన్నగూడెంలో ఘటన
పాలకుర్తి, డిసెంబరు 17: చెల్లెళ్లకు భూమి రాసిచ్చాడనే కోపంతో కన్న తండ్రిని కర్రతో కొట్టి హతమార్చాడో కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం గ్రామానికి చెందిన గాయాల వెంకటయ్య(70), వెంకటమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వెంకటయ్యకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో తను 2 ఎకరాలు ఉంచుకొని ఐదెకరాలు కుమారుడి పేరున పట్టా చేయించాడు. అయితే గతంలో వివాహ సమయంలో ఒప్పుకున్న ప్రకారం గత నెలలో ఇద్దరు కూతుళ్ల పేరిట చెరో 20 గుంటల భూమిని పట్టా చేయించాడు. అప్పటి నుంచి తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లిన వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన కొడుకు తండ్రి వెంకటయ్య తలపై కర్రతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.