Etala Rajender : హైకమాండ్ శభాష్ అనేలా పని చేస్తా..
ABN , First Publish Date - 2023-07-05T04:32:06+05:30 IST
తనపై నమ్మకం ఉంచిన హైకమాండ్తో శభాష్ అనిపించుకునేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమితులైన ఈటల రాజేందర్ అన్నారు. తన రాజకీయ అనుభవంతో నేతలందరినీ కలుపుకొని పోయి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తా: ఈటల
హయత్నగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): తనపై నమ్మకం ఉంచిన హైకమాండ్తో శభాష్ అనిపించుకునేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమితులైన ఈటల రాజేందర్ అన్నారు. తన రాజకీయ అనుభవంతో నేతలందరినీ కలుపుకొని పోయి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానని వెల్లడించారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను ఆ పార్టీ హైకమాండ్ మంగళవారం ప్రకటించింది. ఈ వార్త తెలుసుకున్న ఈటల.. హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు తనకు అప్పగించినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, కిషన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్ అహంకారాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ పాలనపై పోరాడతాం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఓబీసీని ప్రధాన మంత్రిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని చెప్పారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను గెలిచామని, ఓ ఎమ్మెల్సీ స్థానంతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 మంది కార్పొరేటర్లు విజయం సాధించారని చెప్పారు. అలాగే ఖమ్మం, వరంగల్ ఎన్నికల్లోను బీజేపీ అత్యధిక పదవులను గెలుచుకుందన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే ఓ కుటుంబం, కాంగ్రెస్ గెలిస్తే ఓ వర్గం అధికారంలోకి వస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఈటల ఈ సందర్భంగా కోరారు.