ప్రజాభీష్టం మేరకే పోటీ చేస్తాం

ABN , First Publish Date - 2023-06-01T03:38:07+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేసే స్థానాలపై ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.

ప్రజాభీష్టం మేరకే పోటీ చేస్తాం

ఏయే స్థానాల్లో అన్నది ఎన్నికల వేళే నిర్ణయిస్తాం: అసద్‌

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేసే స్థానాలపై ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు. బుధవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మజ్లి్‌సకు దమ్ముంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన సవాల్‌పై ఒవైసీ స్పందిస్తూ.. పార్టీ పోటీ చేసే స్థానాలను కార్యకర్తలు, ప్రజల అభిమతానికి అనుగుణంగా నిర్ణయిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్కడి పార్టీ నేతలు, ప్రజల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ఏయే స్థానాల్లో పోటీ చేయాలనేది ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు రూ.500 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన మెట్రో రైలు పనులను పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణ సదనను ప్రారంభించడాన్ని ఆయన స్వాగతిస్తూ.. ముస్లిం సెంటర్‌ను సైతం త్వరగా పూర్తి చేయించాలని కోరారు. దళిత బంధు తరహాలో నిరుపేద ముస్లింలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రధాని మోదీ తీరును ఒవైసీ తప్పుపట్టారు. ఆయన కేవలం హిందువులకు మాత్రమే ప్రధాని కాదని, 130 కోట్ల మంది భారతీయులకు ప్రధాని అని గుర్తుచేశారు. ముస్లింల భద్రతకు సంబంధించి రాహుల్‌ ప్రకటనపై ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింల గురించి ప్రశ్నించిన సందర్భంలో దళితుల గురించి సమాధానం ఇవ్వడం సరికాదన్నారు.

Updated Date - 2023-06-01T03:38:07+05:30 IST