టెట్ పరీక్ష కేంద్రాలు హౌస్ ఫుల్!
ABN , First Publish Date - 2023-08-16T04:08:09+05:30 IST
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుకు బుధవారం ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు వేగంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈక్రమంలో అనేకచోట్ల టెట్ నిర్వహణ కేంద్రాలు పూర్తిగా నిండిపోతున్నాయి.
ఆరు జిల్లాల్లో మూసివేత
ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పక్కజిల్లాలే!
నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుకు బుధవారం ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు వేగంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈక్రమంలో అనేకచోట్ల టెట్ నిర్వహణ కేంద్రాలు పూర్తిగా నిండిపోతున్నాయి. దీంతో ఆలస్యంగా దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు పక్క జిల్లాలకు వెళ్లి పరీక్షలను రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెట్ నిర్వహణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఈ నెల 2 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 14 సాయంత్రం వరకు సుమారు రెండున్నర లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. పరీక్ష నిర్వహణకు రాష్ట్రంలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఆయా జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య ఆధారంగా కేంద్రాలను కేటాయించనున్నారు. ముందు దరఖాస్తులను చేసుకున్న వారికి వారు కోరుకున్న కేంద్రాలను కేటాయిస్తారు. పరీక్ష కేంద్రాలు పూర్తిగా నిండితే, ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే వారు ఇతర కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
సోమవారం సాయంత్రం వరకు ఆరు జిల్లాల్లో కేంద్రాలు నిండిపోవడం గమనార్హం. దాంతో ఆ తర్వాత దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు ఇతర జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలను ఆప్షన్గా ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు భద్రాది కొత్తగూడెం, హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ వంటి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు నిండిపోవడంతో వాటికి దరఖాస్తుల స్వీకరణను అధికారులు నిలిపేశారు. దాంతో ఆ ప్రాంతాల చెందిన అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లోని కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 15న ఉదయం పేపర్-1ను, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. అదే నెల 27న ఫలితాలను వెల్లడించ నున్నారు. డీఎడ్, బీఎడ్ వంటి కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ రాయడానికి అర్హులవుతారు. పరీక్షను 150 మార్కులకు నిర్వహించనుండగా.. జనరల్ కోటా అభ్యర్థులు 60ు మార్కులను, బీసీ కేటగిరి అభ్యర్థులు 50ు మార్కులను, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల విభాగంలోని అభ్యర్థులు కనీసం 40ు మార్కులను సాధించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక టెట్ దరఖాస్తుల్లో దొర్లే పొరపాట్లను సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారు. పొరపాటున ఏదైనా తప్పు నింపితే సరిచేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా అని అభిప్రాయపడుతున్నారు.