తెలంగాణ క్యాపెక్స్ 59.6 శాతమే
ABN , First Publish Date - 2023-06-26T03:21:39+05:30 IST
రాష్ట్రాల సుస్థిర అభివృద్ధికి గీటురాయిగా.. మౌలిక వసతుల కల్పనలో కీలకం.. మూల ధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్-క్యాపెక్స్). అలాంటి కీలకమైన మూలధన వ్యయానికి సంబంధించి కేటాయింపులను బడ్జెట్లో ఘనంగా చూపుతున్న వివిధ రాష్ట్రప్రభుత్వాలు..
23% మూలధన వ్యయంతో అట్టడుగున ఆంధ్రప్రదేశ్
‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ ఆర్థికవేత్తల విశ్లేషణలో వెల్లడి
బడ్జెట్ ప్రకటనలు ఘనం.. వాస్తవ వ్యయం అంతంతమాత్రం
న్యూఢిల్లీ, జూన్ 25: రాష్ట్రాల సుస్థిర అభివృద్ధికి గీటురాయిగా.. మౌలిక వసతుల కల్పనలో కీలకం.. మూల ధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్-క్యాపెక్స్). అలాంటి కీలకమైన మూలధన వ్యయానికి సంబంధించి కేటాయింపులను బడ్జెట్లో ఘనంగా చూపుతున్న వివిధ రాష్ట్రప్రభుత్వాలు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలూ వాస్తవంలో ఆ స్థాయిలో ఖర్చుచేయట్లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్తల తాజా విశ్లేషణలో తేలింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న మూలధన వ్యయం రూ.29,064 కోట్లు కాగా వాస్తవంగా ఖర్చుచేసింది రూ.17,322 కోట్లే. అంటే.. 59.6 శాతమే. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే మరీ ఘోరంగా 23 శాతం మూల ధన వ్యయంతో ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.
కర్ణాటక, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు మాత్రం బడ్జెట్లో పేర్కొన్నదాని కన్నా అధికంగా మూల ధన వ్యయం చేశాయి.
ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు బడ్జెట్ ప్రకటించిన మూలధన వ్యయంలో 98 శాతం మేర వాస్తవ వ్యయం చేసి రెండో స్థానంలో నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.29,917 కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించి.. రూ.6,917 కోట్లు మాత్రమే ఖర్చు చేసి అట్టడుగున నిలిచింది. ఏపీ కన్నా త్రిపుర (41.3ు), నాగాలాండ్ (47.7ు), హరియాణా (48.1ు), రాజస్థాన్ (50.2ు) మెరుగ్గా మూలధన వ్యయం చేయడం గమనార్హం.
మహారాష్ట్ర మూల ధన వ్యయం 72.4 శాతం (రూ.83,530 కోట్లకుగాను రూ.60,499 కోట్ల వాస్తవ వ్యయం).
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్యాపెక్స్లో 69.4 శాతం (రూ.19,330 కోట్లకుగాను.. రూ.13,407 కోట్లు) మేర ఖర్చు పెట్టగా.. ఉత్తరప్రదేశ్ మూలధనవ్యయం 69 శాతం. రూ.1,35,677 కోట్ల క్యాపెక్స్ను బడ్జెట్లో ప్రకటించి.. రూ.93,555 కోట్లు వాస్తవంగా ఖర్చుచేసింది.
ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 68.4 శాతం కాగా.. మేఘాలయ (67.8ు), పశ్చిమబెంగాల్ (67.6ు), అసోం (64.5ు), పంజాబ్ (61.1ు) తదుపరి స్థానాల్లో నిలిచాయి. పంజాబ్ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది.
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాలూ కలిపి ప్రకటించిన మూల ధన వ్యయం రూ.7.4 లక్షల కోట్లు కాగా.. వాస్తవంగా ఖర్చుచేసింది రూ.5.71 లక్షలే. అంటే 76.2 శాతమే.
2021 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలూ కలిపి చేసిన వ్యయం.. ప్రకటించిన దాంతో పోలిస్తే 72 శాతమే. కరోనా కారణంగా ఆ ఏడాది మూలధన వ్యయం బాగా తగ్గిపోయింది. 2022లో రాష్ట్రాల మూలధన వ్యయం 95 శాతానికి పెరిగింది.