Share News

బోథ్‌, చేవెళ్ల, వనపర్తి అభ్యర్థులకు బీఫామ్‌ల నిలిపివేత?

ABN , First Publish Date - 2023-11-06T03:20:38+05:30 IST

వంద స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. వాటిలోని ఓ మూడు స్థానాల్లో అభ్యర్థిత్వంపై మరోమారు సమీక్ష చేపట్టనున్నట్లు గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బోథ్‌, చేవెళ్ల, వనపర్తి అభ్యర్థులకు బీఫామ్‌ల నిలిపివేత?

పునః సమీక్షించనున్న కాంగ్రెస్‌!

హైకమాండ్‌కు భారీగా ఫిర్యాదులే కారణం

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వంద స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. వాటిలోని ఓ మూడు స్థానాల్లో అభ్యర్థిత్వంపై మరోమారు సమీక్ష చేపట్టనున్నట్లు గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో బోథ్‌, చేవెళ్ల, వనపర్తి స్థానాలు ఉన్నట్లు తెలుస్తోంది. బోథ్‌లో వెన్నెల అశోక్‌, వనపర్తిలో చిన్నారెడ్డి, చేవెళ్లలో పామెన భీంభరత్‌ అభ్యర్థిత్వాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సామాజిక సమీకరణ, స్థానికత కారణం చూపుతూ బోథ్‌ అభ్యర్థిపైన, కేసుల రీత్యా చేవెళ్ల అభ్యర్థిపైనా అధిష్ఠానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు. అలాగే వనపర్తిలో చిన్నారెడ్డి అభ్యర్థిత్వంపైనా స్థానిక నాయకత్వం నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలపై అధిష్ఠానం పునఃసమీక్ష చేపడుతోందని, అందుకే అభ్యర్థులకు బీ ఫామ్‌లను ఇవ్వడం లేదని పార్టీకి చెందిన కొంతమంది నేతలు చెబుతున్నారు.

Updated Date - 2023-11-06T03:21:21+05:30 IST