విమలక్కకు ‘సుద్దాల’ పురస్కారం
ABN , First Publish Date - 2023-10-14T04:36:47+05:30 IST
ఆదివాసీ ఆర్తనాదాలను, సబ్బండజాతి గుండె ఘోషలను తన గొంతుగా మలుచుకున్న ధిక్కార గళ గర్జని విమలక్క అని వక్తలు కొనియాడారు.
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ ఆర్తనాదాలను, సబ్బండజాతి గుండె ఘోషలను తన గొంతుగా మలుచుకున్న ధిక్కార గళ గర్జని విమలక్క అని వక్తలు కొనియాడారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విమలక్కకు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ముఖ్య అతిథి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి అందచేసి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు పాటలతో పాటు విమలక్క పాటలంటే ఇష్టమని చెప్పారు. పీపుల్స్స్టార్ ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. లేడీ గద్దర్ విమలక్క అంటూ ప్రశంసించారు. తెలంగాణ నేల మీద పుట్టిన అరుదైన కవి సుద్దాల హనుమంతు అయితే, ఆయన పోరాట వారసత్వాన్ని గద్దర్, విమలక్క కొనసాగించారని ప్రొఫెసర్ కాసీం అన్నారు. తాను ఈ పురస్కారం అందుకోవడం ప్రజా ఉద్యమ పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు విమలక్క చెప్పారు. ఈ సందర్భంగా విమలక్కకు శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి రూ.50 వేల నగదును బహూకరించారు.