Share News

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల రాళ్ల దాడి

ABN , First Publish Date - 2023-11-10T04:03:50+05:30 IST

నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల రాళ్ల దాడి

ఇబ్రహీంపట్నంలో 30 మంది కార్యకర్తలు,

డీసీపీ సహా ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలు

ఇబ్రహీంపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్లు వేసేందుకు వేర్వేరుగా భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ వేసి ర్యాలీగా వెనుదిరిగారు. అదే సమయంలో రోడ్డుకు మరోవైపు ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి ఆర్డీవో కార్యాలయంవైపు కాంగ్రెస్‌ శ్రేణులు ర్యాలీగా వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ముందు రోడ్డుకు ఇరువైపులా రెండు పార్టీలు ఎదురుపడ్డాయి. ఇరు వర్గాలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. ఈ దాడుల్లో రెండు పార్టీలకు చెందిన సుమారు 30 మంది కార్యకర్తలు, ఎల్బీ నగర్‌ డీసీపీ సాయి కల్పన సహా ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ ప్రచార వాహనంతో పాటు పలు కార్ల అద్దాలు పగిలాయి. రాచకొండ సీపీ డీఎ్‌స.చౌహాన్‌ వెంటనే ఇబ్రహీంపట్నం చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో ఉన్న పోలీసులను పరామర్శించారు. ఒకేసారి రెండు పార్టీల ర్యాలీలకు అనుమతివ్వడం వల్లే ఇలా జరిగిందని, ఇది పోలీసుల వైఫల్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ర్యాలీ బీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్దకు రాగానే పథకం ప్రకారమే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2023-11-10T04:03:51+05:30 IST