సింగరేణికి విద్యుత్ సంస్థల
ABN , First Publish Date - 2023-09-22T02:36:08+05:30 IST
తెలంగాణ కొంగు బంగారం సింగరేణి నిండా మునుగుతోంది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల రూపేణా తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి.
బకాయిలు రూ.24,730 కోట్లు!
బ్యాంకు డిపాజిట్లతోనే కార్మికులకు వేతన బకాయిలు, బోన్సలు
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కొంగు బంగారం సింగరేణి నిండా మునుగుతోంది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల రూపేణా తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థలు అక్షరాలా రూ.24,730 కోట్లు సింగరేణికి బకాయి పడ్డాయి. ఈ రెండు నెలలు (జూలై, ఆగస్టు) కలిపి రూ.25 వేల కోట్లు దాటినట్లు సమాచారం. ఇందులో సింగరేణి థర్మల్ విద్యుత్తో పాటు సోలార్ విద్యుత్ వాటా రూ.19,761.11 కోట్లు, బొగ్గు వాటా రూ.4,968.94 కోట్లు.. అయితే రూ.19,761.11 కోట్లలో లేట్ పేమెంట్ సర్చార్జీ (ఎల్పీఎస్) వాటా రూ.6,762.67 కోట్లుగా ఉంది. విద్యుత్ కొనుగోళ్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ఎల్పీఎస్ కింద జరిమానా వేస్తారు.
జూన్ మాసానికి గాను సింగరేణి పనితీరు నివేదిక (పర్ఫామెన్స్ రిపోర్టు) ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక ఈనెల 21న ఏకకాలంలో రూ.1,726 కోట్లను వేజ్ బోర్డు బకాయిల కింద సింగరేణి కార్మికులకు సంస్థ చెల్లించింది. అయితే విద్యుత్ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేకపోవడంతో బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న నిధులను వాడుకొని.. వేజ్ బోర్డు బకాయిలకు చెల్లింపులు చేసింది. అంతేకాకుండా దసరాకు లాభాల బోనస్, దీపావళికి తాయిలాల కోసం కూడా బ్యాంకుల్లో దాచుకున్న డిపాజిట్ల వైపే సింగరేణి చూస్తోంది. మొత్తంగా బకాయిలు ఏయేటికాయేడు తగ్గాల్సి ఉండగా పెరుగుతున్నాయని అధికారులు వాపోతున్నారు. ఈ బకాయిలన్నీ ఏకకాలంలో వస్తే.. థర్మల్ కేంద్రాల నిర్మాణాల కోసం చేసిన అప్పులన్నీ తీరనున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్టీపీసీతో పాటు ప్రైవేట్ సంస్థల నుంచి కరెంట్ కొనాలంటే ముందస్తుగా చెల్లింపులు చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) విధానం అమల్లో ఉండగా.. సింగరేణికి ఆ రక్షణ లేనందువల్లే బకాయిలు రాబట్టుకోలేని పరిస్థితి.. వెరసి గుట్టలా పెరిగిన బకాయిలు సింగరేణి పుట్టి ముంచుతాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.