కార్పొరేట్ లుక్లో సిద్దిపేట ప్రభుత్వ కళాశాల!
ABN , First Publish Date - 2023-08-09T03:54:31+05:30 IST
సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాల, పాఠశాల కొత్త రూపురేఖలను సంతరించుకున్నాయి.
రూ.3 కోట్ల సీఎ్సఆర్ నిధులతో కొత్త హంగులు
అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్ ట్రాక్..
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట క్రైం, ఆగస్టు 8: సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాల, పాఠశాల కొత్త రూపురేఖలను సంతరించుకున్నాయి. విద్యా సముదాయం క్రీడా సౌరభంగా మారింది. మంత్రి హరీశ్రావు కృషితో రూ.3 కోట్ల సీఎ్సఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ) నిధులతో రాష్ట్రానికే మోడల్గా తీర్చిదిద్దారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలపించేలా నిర్మించిన ఈ విద్యాసముదాయాన్ని బుధవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. రూ.3 కోట్లతో ప్రాథమిక, ఉన్నత, జూనియర్ కళాశాలలో సకల సౌకర్యాలతో పాటు క్రీడా సదుపాయాలనూ ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
గతంలో కళాశాలకు, పాఠశాలకు ఒకే మైదానం ఉండగా ఇప్పుడు హైస్కూల్కు ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐదు వరుసల అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్ సింథటిక్ టర్ఫ్తో నిర్మించారు. వాలీబాల్, ఫుట్బాల్ ఆడేందుకు వీలుగా రన్నింగ్ ట్రాక్ మధ్యలో గ్రీన్టర్ఫ్తో మైదానాన్ని ఏర్పాటు చేశారు. ట్రాక్ చుట్టూ సిట్టింగ్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలోని మార్నింగ్, ఈవినింగ్ వాకర్స్, రన్నర్స్ కూడా ఈ అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్ వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈ ట్రాక్పై జాతీయస్థాయి పోటీలు నిర్వహించేలా సకల సౌకర్యాలు కల్పించారు. స్కూల్ ప్రాంగణమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. పాఠశాల ఆవరణలో మోడల్ కిచెన్, భోజనశాల, మోడల్ టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, సమావేశాలకు ప్రత్యేక వేదిక.. ఇలా అన్ని అందుబాటులోకి తెచ్చారు.