వణికిస్తున్న చలి!
ABN , Publish Date - Dec 15 , 2023 | 11:27 PM
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి పంజా విసురుతోంది. శీతల గాలలు బెంబేలెత్తిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
చౌదరిగూడెంలో 9.4.. మర్పల్లిలో 9.9 డిగ్రీలు, మౌలాలీలో 11.9 కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదు
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 15 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి పంజా విసురుతోంది. శీతల గాలలు బెంబేలెత్తిస్తున్నాయి. చలితీవ్రత నుంచి ఉపశమనం పొందటానికి చలిమంటలు వేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఈ సీజన్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పది డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పెరుగుతున్న చలి తీవ్రతకు ప్రజలు శాస్వకోశ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం అయిందంటే చాలు చేతులు బిగుసుకుపోతున్నాయి. అత్యవసరం ఉంటే తప్పా, బయటకు వచ్చేందుకు సాహసించటడం లేదు. రాష్ట్రంలో సంగారెడ్డిలో 8.9 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే.. దాని తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డిజిల్లా చౌదరిగూడెంలో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. అలాగే షాబాద్ మండలం తాళ్లపల్లిలో 10 డిగ్రీలు, మెయినాబాద్ రెడ్డిపల్లిలో 10.5 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం ఎలిమినేడులో 10.9 డిగ్రీలు, కందుకూరు, కొత్తూరులలో 11డిగ్రీలు, రాజేంద్రనగర్, షాబాద్, మహేశ్వరంలలో 11.10 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో మర్పల్లిలో 9.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోమిన్పేటలో 10.4 డిగ్రీలు, నవాబుపేటలో 11.4 డిగ్రీలు, పూడూరు మండలం మన్నెగూడలో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ జిల్లా మౌలాలీలో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.