Kumaram Bheem Asifabad- చుక్కల్లో ‘సన్నా’లు
ABN , Publish Date - Dec 23 , 2023 | 09:55 PM
బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. బియ్యం ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్న బియ్యం క్వింటాల్కు 4,200 నుంచి 4,500 రూపాయలు పలుకుతోంది.
- ఉత్పత్తి పెరిగినా అందుబాటులో లేక పేదల ఇబ్బందులు
- జిల్లాలో 24వేలకు పైగా కుటుంబాలకు అందని రేషన్
బెజ్జూరు, డిసెంబరు 23: బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. బియ్యం ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్న బియ్యం క్వింటాల్కు 4,200 నుంచి 4,500 రూపాయలు పలుకుతోంది. పాత బియ్యమైతే 5,200 రూపాయలకు పైగా పలుకుతోంది. పదిహేను రోజుల్లోనే సుమారు 500 రూపాయలకుపైగా పెరిగింది. ఈ ధరలను చూసి బియ్యం కొనాలంటే సామాన్య, మద్యతరగతి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. సరిగ్గా నెల రోజుల కిందట ఉన్న ధరకు ఇప్పటికి 20శాతం ధర పెరిగిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. కొత్త బియ్యం సోనామసూరి ధర క్వింటాల్కు 4,200 రూపాయలుగా ఉంది. అదే హెచ్ఎంటీ బియ్యం ధర 5,600 రూపాయలు పలుకుతోంది. పాత బియ్యం అయితే 5,200నుంచి 6,000 రూపాయల వరకు ధరలు ఉన్నాయి. ఇక సూపర్ మార్కెట్లో 25కిలోల పాత బియ్యం సంచికి 1,600 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్ ధర 6,400 రూపాయలుగా ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం కొత్త బియ్యం ధర 4,000 రూపాయలుగా ఉంది. పాత బియ్యం 5,000 రూపా యలుగా ఉన్నది. నెల వ్యవధిలో ధర 1,000 రూపాయలు పెరిగింది.
సామాన్య జనం బెంబేలు..
రాష్ట్రంలో ఒక్కసారిగా సన్న బియ్యం ధరలకు రెక్కలకు రావడంతో సామాన్య జనం బెంబేలు ఎత్తుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు అమాంతం పెరగడంతో మద్యతరగతి, పేద వర్గాల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా ఏజెన్సీ కావడం నిరుపేద కుటుంబాలే అధికంగా ఉండటం, కూలీకి వెళ్తే కాని రెక్కాడని స్థితిలో ఉన్న పేదలకు బియ్యం ధరలు వింటేనే గుండెలు పగిలేలా ఉన్నాయి. దీంతో అధిక రేట్లకు బియ్యం కొనుగోలు చేసి ఎలా తినేదని పేద ప్రజలు వాపోతున్నారు. మరోవైపు పేదలకు అందాల్సిన రేషన్ కార్డులు గత ఏడేళ్లుగా అందకపోవడంతో ఇటు రేషన్ అందక, అటు సన్న బియ్యం కొనలేక పేద ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కొత్తగా రేషన్ కార్డుల కోసం 24వేలకు పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పదేపదే ఊరిం చి ఇవ్వకుండా పోయింది. అయితే రాష్ట్రంలో కొత్తగా కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడంతో పేద ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జిల్లాలో రేషన్ కార్డులు అందక మార్కెట్లో బియ్యం కొనుక్కొని తినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం గతం కంటే బియ్యం ధరలు అధికంగా ఉండటంతో ప్రభుత్వ బియ్యం అందక, సన్న బియ్యం కొనలేక పేద వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ధాన్యానికి పెరిగిన డిమాండ్..
ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాల్కు 2,200 రూపా యలుగా నిర్ణయించింది. ప్రైవేటు వ్యాపారులు 3,200 రూపాయలు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అదే పాత వడ్లు అయితే క్వింటాల్కు 4,000 రూపాయల వరకు కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో వరి పంట దెబ్బ తినడంతో తెలంగాణలో పండిన ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దాంతో ధర అమాంతం పెరుగుతోంది. వ్యాపా రులు రైతు కల్లాల వద్దే వెళ్లి తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఎండిన ధాన్యం అయితే క్వింటాల్కు 3,500వరకు డిమాండ్ ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ మద్దతు ధర కన్నా 60నుంచి 70 శాతం అదనపు ధర వస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. వడ్ల ధరలు పెరగడంతో ఎలాగూ బియ్యం ధరలు కూడా పెరిగాయి. ధరలు మరింత కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వడ్లకు అమాంతం ధర రావడంతో బియ్యం ధరలు కూడా అదేస్థాయిలో పెరిగిన కారణంగా సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
భారమవుతున్న బియ్యం ధర..
- దుర్గం మహేశ్వరి, పాపన్పేట
బియ్యం ధరలు సామాన్యులకు భారమవుతున్నాయి. నెల క్రితం వరకు ఉన్న ధరలు ఇప్పుడు అమాంతం పెరగడంతో కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. పదిహేను రోజుల్లో సన్నబియ్యం ధరాలు క్వింటాలుకు 500 రూపాయల మేర పెరిగాయి. అధికారులు ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి.
కొనలేని స్థితిలో బియ్యం..
- మోర్లె తిరుపతి, బెజ్జూరు
గతంలో ఎన్నడూ లేనివిధంగా బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగ డంతో కొనలేని స్థితిలో ఉన్నాం. ఏడేళ్లుగా ప్రభుత్వం రేషన్కార్డులు మం జూరు చేయకపోవడంతో బియ్యం అందడం లేదు. దీంతో మార్కెట్లో దొరికే సన్నబియ్యం కొనలేక, రేషన్ బియ్యం రాక ఇబ్బందులు పడుతున్నాం.