రైతుబంధు’ వెంటనే విడుదల చేయాలి
ABN , First Publish Date - 2023-12-05T04:19:32+05:30 IST
రాష్ట్రంలో యాసంగి పంటకు సిద్ధమైన రైతులకు రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ
మిగిలిన 10శాతం రుణాలనూ మాఫీ చేయాలి
కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే పోరాటమే
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి పంటకు సిద్ధమైన రైతులకు రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు ఇబ్బంది పడకుండా తాము రైతుబంధు నిధులను విడుదల చేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందని, ఇప్పుడు ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినందున వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. పాత మొత్తంలో కాకుండా, కాంగ్రెస్ ఇచ్చిన కొత్త హామీ ప్రకారం రైతులకు డబ్బులు జమ చేయాలని సూచించారు. అలాగే రైతు రుణమాఫీ ఇప్పటికే రూ. 15వేల కోట్ల మేర పూర్తి చేశామని, మిగిలిన రూ. 4వేల కోట్లను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోరాడతామని, విద్యుత్ విషయంలో ఇచ్చిన హామీకి ఒక్క గంట తక్కువైనా కొట్లాడతామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.