విశ్రాంత ఐఏఎస్ ఇంటి కబ్జా యత్నం
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:33 AM
ఫోర్జరీ డాక్యుమెంట్లతో విశ్రాంత ఐఏఎస్ అఽధికారి భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారనే ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ(టీఎ్సపీఏ) డిప్యూటీ డైరెక్టర్గా సేవలందిస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ భట్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల్లో ఐపీఎస్ నవీన్కుమార్
అరెస్టు.. సీసీఎ్సలో విచారణ.. నోటీసులు
ఆయన అన్న, వదినలకు ఇప్పటికే రిమాండ్
ఫోర్జరీ డాక్యుమెంట్లతో భన్వర్లాల్
ఇంటి ఆక్రమణకు పన్నాగం!!
భన్వర్లాల్ భార్య ఫిర్యాదుతో కేసు
హైదరాబాద్/సిటీ/బర్కత్పుర, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఫోర్జరీ డాక్యుమెంట్లతో విశ్రాంత ఐఏఎస్ అఽధికారి భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారనే ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ(టీఎ్సపీఏ) డిప్యూటీ డైరెక్టర్గా సేవలందిస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ భట్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఆయనను అదుపులోకి తీసుకుని, విచారించాక.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి, విడిచిపెట్టినట్లు జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని రోడ్ నంబర్ 72లో విశ్రాంత ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ భార్య మణిలాల్కు ఇల్లు ఉంది. 2014 అక్టోబరు 14న ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ సోదరుడు సాంబశివరావు ఆమెను కలిసి.. ఇంటిని అద్దెకు అడిగారు. అదే ఏడాది నవంబరు 1న వీరి మధ్య ఐదేళ్లకు గాను రెంటల్ అగ్రిమెంట్ జరిగింది. 2019 జూన్లో భన్వర్లాల్ పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ క్వార్టర్ను ఖాళీ చేస్తున్నందున.. సొంతింటికి వెళ్లాలని నిర్ణయించారు. ఐదేళ్ల అగ్రిమెంట్ పూర్తవ్వనున్న నేపథ్యంలో ఇంటిని ఖాళీ చేస్తే.. తాము ఆ ఇంట్లోకి మారుతామని చెప్పారు. అయితే.. ఐపీఎస్ నవీన్కుమార్ కూడా అదే ఇంట్లో ఉంటుండడంతో.. భన్వర్లాల్ దంపతులు ఓల్డ్ అల్వాల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, నివసిస్తున్నారు. 2020 జనవరి నుంచి సాంబశివరావు అద్దెను చెల్లించడం లేదు. దాంతో.. మణిలాల్ ఆయనకు నోటీసులు పంపారు. దీనికి స్పందించిన సాంబశివరావు నాలుగు పోస్ట్ డేటెడ్ చెక్కులను పంపించారు. ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఆ కేసు కోర్టులో కొనసాగుతోంది. 2020 డిసెంబరులో ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పిన సాంబశివరావు.. నవంబరులో భన్వర్లాల్ దంపతులకు లీగల్ నోటీసులు పంపాడు.
ఇంటి మరమ్మతులకు రూ.11.30 లక్షలు ఖర్చు చేశానని, రూ.38లక్షలు భన్వర్లాల్ దంపతులకు అప్పుగా ఇచ్చాననేది ఆ నోటీసుల సారాంశం. దీనికి సంబంధించిన కేసు కొనసాగుతోంది. ఈ క్రమంలో నవీన్, అతని సోదరుడు సాంబశివరావు నకిలీ పత్రాలు సృష్టించి, కబ్జాకు ప్రయత్నించారని మణిలాల్ ఆరోపించారు. వీరి వేధింపుల వల్లే భన్వర్లాల్ ఆరోగ్యం దెబ్బతిన్నదని పేర్కొంటూ.. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీలోని 420, 406, 467, 468, 471 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెల 22న సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నవీన్ బుధవారం ఉదయం టీఎ్సపీఏకు వెళ్తుండగా.. అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఐపీఎస్ అధికారి నవీన్ను అరెస్టు చేయడం రాజ్యాంగ విర్ద్ధుమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా.. ఓ ఐపీఎస్ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూ.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. బుధవారం కాచిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. బీసీ అధికారి అయిన నవీన్ పదోన్నతిని అడ్డుకునేందుకు కొందరు అగ్రవర్ణ అధికారులు కుట్రలు చేస్తూ.. ఆయనను అరెస్టు చేయించారని ఆరోపించారు. నవీన్ కుమారుడు సాహిత్ మాట్లాడుతూ.. తమ తండ్రి పదోన్నతిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నవీన్ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్న సమయంలో.. అతణ్ని అరెస్టు చేశారనే ప్రచారం జరగడంతో.. డీజీపీ రవిగుప్తాకు పలు సంఘాల నాయకులు ఫోన్లు చేయడం గమనార్హం..!
వివాదాలు కొత్తేం కాదు..!
నవీన్కుమార్ వివాదాల్లో ఇరుక్కోవడం ఇప్పుడు కొత్తేమీకాదు. గతంలో రంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో హోంగార్డులతో ఆర్డర్లీ(అనధికారిక విధులు) చేయించుకుని, వివాదంలో ఇరుకున్నారు. అప్పట్లో ఈ విషయం పెను దుమారం రేపింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్పీగా పనిచేసిన సమయంలోనూ తీవ్రస్థాయి విమర్శలొచ్చాయి. సొంత మనుషులతో సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలున్నాయి. ఏఎస్పీగా ఉండి జిల్లా ఎస్పీపై ఆరోపణలు చేయడం అప్పట్లో పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది.