సీఎం రేవంత్తో రఘురామ్రాజన్ భేటీ
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:27 AM
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సమావేశమైన వారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు పలు సూచనలు
రుణమాఫీ, అభివృద్ధి-సంక్షేమం కొనసాగింపుపై చర్చ
త్వరలో అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం: సీఎం
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సమావేశమైన వారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల సమస్య ఏర్పడకుండా అనుసరించాల్సిన మార్గాలపై, సమగ్ర ప్రణాళికపైనా కీలకంగా చర్చ జరిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రఘురామరాజన్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ముఖ్యంగా.. రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల సమీకరణపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీకి అవసరమైన నిధుల సేకరణపై చర్చ జరిగింది. ఆ నిధులను ప్రభుత్వమే బ్యాంకర్ల నుంచి రుణంగా తీసుకుని.. వాయిదా పద్ధతిలో తీర్చే విధానంపై రేవంత్, రఘురామరాజన్ మధ్య లోతుగా చర్చ జరిగినట్టు సమాచారం. నిధుల సమీకరణకు గత ప్రభుత్వం అవలంభించిన విధానాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రుణాలు సేకరించిందని కేంద్రం పలుసార్లు వ్యాఖ్యానించగా.. ఆ అంశంపై గత ప్రభుత్వం, కేంద్రం మధ్య కొంతకాలం వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన సర్కారు.. రుణాల సేకరణపైనా లోతుగా చర్చ జరిపినట్టు సమాచారం. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.
రేవంత్కు జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు అందాయి. ఆదివారం మధ్యాహ్నం.. అలంపూర్లోని జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సీఎంను ఆయన నివాసంలో కలిసి ఆశీర్వచనం చేశారు. సీఎంకు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ వినతిపత్రం అందించారు. శక్తిపీఠమైన జోగులాంబ ఆలయానికి నూతన వైభవం తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ను అడిగి తెలుసుకున్నారు.