నైనీ బ్లాక్ ప్రారంభానికి చర్యలు
ABN , Publish Date - Dec 30 , 2023 | 03:30 AM
సింగరేణి సంస్థకు ఒడిసాలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
వేసవిలో విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి
సింగరేణి అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థకు ఒడిసాలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో సింగరేణి సంస్థ అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు నైనీ బ్లాక్ ప్రారంభానికి ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అలాగే, తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను కేంద్రం వేలం వేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ వివరాలపై ఆరా తీశారు. మంత్రి కోరిన వివరాలు తెలియజేసిన అధికారులు సంస్థకు మేలు జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సింగరేణి విస్తరణకు బొగ్గు మైనింగ్ కాకుండా ఇతర ఖనిజ అన్వేషణకు రూపొందించిన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని మంత్రి భట్టి ఈ సందర్భంగా అధికారులను అడిగారు. విభజన చట్టంలో కేంద్రం పేర్కొన్న మేరకు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై అధ్యయనం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, వేసవిలో విద్యుత్కు కొరత రాకుండా బొగ్గును ఉత్పత్తి చేయాలని భట్టివిక్రమార్క అధికారులకు సూచించారు. బొగ్గును నిరంతరాయంగా ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని అన్ని థర్మల్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు రవాణా చేయాలని ఆదేశించారు. కాగా, సింగరేణి ఉపరితల భూగర్భగనులు, కొత్త ప్రాజెక్టులు, సింగరేణి థర్మల్, సోలార్ ప్రాజెక్టులు, మిషనరీ వినియోగం, బొగ్గు మార్కెటింగ్, రవాణాలపై ఆయా విభాగాల డైరెక్టర్లు ఈ సందర్భంగా మంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ని వివరించారు. సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, సీఎ్సఆర్ నిధుల కేటాయింపు తదితర అంశాలపైన మంత్రి సమీక్షించారు. కార్మికుల సంక్షేమంపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కారుణ్య నియామకాల కోసం జరుగుతున్న మెడికల్ బోర్డు ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సింగరేణి ఎండీ ఎన్ శ్రీథర్, డైరెక్టర్లు, వివిధ విభాగాల మేనేజర్లు పాల్గొన్నారు.