ప్రముఖ లలిత సంగీతకారుడు చిత్తరంజన్ కన్నుమూత
ABN , First Publish Date - 2023-07-22T04:43:01+05:30 IST
ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు, ఆకాశవాణిలో సుదీర్ఘ కాలం పని చేసిన మహాభాష్యం చిత్తరంజన్ (85) ఇకలేరు.
హైదరాబాద్ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు, ఆకాశవాణిలో సుదీర్ఘ కాలం పని చేసిన మహాభాష్యం చిత్తరంజన్ (85) ఇకలేరు. వయసు రిత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగోల్లోని తన చిన్నకుమార్తె ఇంట్లో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చిత్తరంజన్ తండ్రి నిజాం ప్రభుత్వంలోని దక్కన్ రేడియోలో ఇంజనీర్గా పని చేశారు. తల్లి పెరిన్ దేవి దగ్గర సంగీత శిక్షణ పొందిన చిత్తరంజన్ తన ఏడో ఏట నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. అనంతరం మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యునిగా కొంతకాలం ఆయనతో కలిసి కచేరీలలో పాల్గొన్నారు. 1971- 1998 వరకు ఆలిండియా రేడియోలో లలిత గీతాల రచయిత, గాయకుడు, సంగీత దర్శకునిగా పని చేశారు. సుమారు 15వేల పాటకు సంగీతం సమకూర్చారు. ఎనిమిది వేల పాటలు పాడి శ్రోతల అభిమాన గాయకుడిగా నీరాజనాలు అందుకున్నారు. లలిత సంగీత సౌరభం, లలిత సంగీతం-80 సంగీత సారస్వత మలయమారుతాలు తదితర పుస్తకాలు రాశారు. తెలుగు వర్సిటీ లలిత సంగీతం డిప్లమా కోర్సుకు పాఠ్యపుస్తకాల తయారీలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ప్రతిభకు మెచ్చి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో పాటు పలు సాంస్కృతిక, కళా సంస్థలు కళారత్న వంటి బిరుదులు, అవార్డులతో సత్కరించాయి. చిత్తరంజన్ అంత్యక్రియలు శనివారం జరగనున్నట్టు సమాచారం. సీనియర్ రచయిత సుధామ, కేంద్ర సాహిత్య అకాడమీ గిరిజన సాహిత్య కమిటీ జాతీయ సభ్యుడు సమ్మెట నాగమల్లేశ్వర రావు, రచయిత సీఎస్ రాంబాబు తదితరులు చిత్తరంజన్ మృతి పట్ల సంతాపం తెలిపారు.