Minister Harish Rao: పార్లమెంటు సాక్షిగా అబద్ధం
ABN , First Publish Date - 2023-03-18T03:53:31+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ...

‘కాళేశ్వరం’పై కేంద్రానిది తప్పుడు ప్రచారం
జాతీయ హోదా కోసం పలుమార్లు విజ్ఞప్తి చేశాం
కక్షతోనే తెలంగాణను విస్మరించారు: మంత్రి హరీశ్
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు వాస్తవాలను దాచి పెట్టి మాట్లాడుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదంటూ కేంద్ర గిరిజన, జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం హరీశ్రావు ట్విటర్ వేదికగా స్పందించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అవాస్తవమని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్.. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తాను పలుమార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని, కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు కూడా లభించాయని వివరించారు. 2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంటులో ప్రశ్నించగా.. అప్పటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారని గుర్తు చేశారు. ఆ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర, మధ్యప్రదేశ్లోని కెన్-బెట్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రతిపాదనను పక్కన పెట్టారని, ఇది కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనమని విమర్శించారు.
కరోనాపై ఆందోళన వద్దు..
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హరీశ్ రావు వైద్య అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దగ్గు, జ్వరం వంటి కొవిడ్ లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలన్నారు.