కేసీఆర్ ఫామ్హౌజ్లో శాంతి యాగం!
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:34 AM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఇటీవల మూడు రోజులపాటు శాంతియాగం నిర్వహించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జగదేవ్పూర్, డిసెంబరు 17: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో ఇటీవల మూడు రోజులపాటు శాంతియాగం నిర్వహించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్హౌజ్లో ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకు.. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి శాంతియాగం నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు డిసెంబర్ 10వ తేదీన ఆ యాగ నిర్వహణకు ముహూర్తం నిర్ణయించారు. కానీ, 9వ తేదీ రాత్రి కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చేరడంతో 10న యాగం జరగలేదు. నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా నిర్వహించాలని పండితులు సూచించడంతో 13వ తేదీన మొదలుపెట్టి.. కరీంనగర్ సహా పలుప్రాంతాలకు చెందిన 40 మంది వేదపండితులు ఈ శాంతియాగాన్ని నిర్వహించినట్లు తెలిసింది. 14న ఎమ్మెల్సీ కవిత, 15న కేసీఆర్ మనవడు హిమాన్షు యాగంలో పాల్గొన్నట్లు సమాచారం. 15వ తేదీ మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి యాగాన్ని ముగించారు. కరీనంగర్కు చెందిన వేద పండితులు ఒక మీడి యా ప్రతినిధికి చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.