కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్పోర్టులను సీజ్ చేయాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 04:26 AM
అవినీతి, అరాచకాలతో ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు బీఆర్ఎస్ నాయకుల పాస్పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వారు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు: బండి సంజయ్
భగత్నగర్, డిసెంబరు 16: అవినీతి, అరాచకాలతో ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు బీఆర్ఎస్ నాయకుల పాస్పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందన్నారు. పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంవోలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ, కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్పోర్టులను సైతం సీజ్ చేయాలని కోరారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణను సర్వనాశనం చేశారని విమర్శించారు.
రుణమాఫీ ఊసేది..?: లక్ష్మణ్
హైదరాబాద్: శాసన సభలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలో రుణ మాఫీ, రైతు బంధు ఊసే లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగం రూపొందించారని విమర్శించారు. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు, ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత ఇవ్వలేదని అన్నారు.