హైదరాబాద్లో పాకిస్థానీ..!
ABN , First Publish Date - 2023-09-01T03:05:29+05:30 IST
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అక్రమంగా తిష్ట వేసిన పాక్ యువకుడు మహ్మద్ ఫయాజ్(24)ను బహదూర్పురా పోలీసులు అరెస్టు చేశారు. అతడు 2018లో దుబాయ్కి
దుబాయ్లో నగరానికి చెందిన యువతితో పెళ్లి
ఆమె కోసం నేపాల్ నుంచి భారత్లోకి చొరబాటు.. అరెస్టు
మదీన, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అక్రమంగా తిష్ట వేసిన పాక్ యువకుడు మహ్మద్ ఫయాజ్(24)ను బహదూర్పురా పోలీసులు అరెస్టు చేశారు. అతడు 2018లో దుబాయ్కి వెళ్లి అక్కడ ఓ దుస్తుల దుకాణంలో పనిచేశాడు. 2019లో బహదూర్పురా కిషన్బాగ్కు చెందిన నేహా ఫాతిమా (29)పని కోసం దుబాయ్కి వెళ్లింది. ఇద్దరూ ఒకేషాపులో పని చేస్తుండడంతో పరిచయం పెరిగి ప్రేమించుకుని అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అనంతరం కొన్నాళ్లకు నేహా ఫాతిమా భారత్కు తిరిగొచ్చి కిషన్బాగ్లో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్లో ఉంటున్న ఫయాజ్ను భారత్కు రప్పించి ఇక్కడే స్థానికత సృష్టించి తమ వద్ద ఉంచుకోవాలని యువతి తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగంలకు ఆలోచన వచ్చింది. దీంతో పథకం ప్రకారం ఫయాజ్ను నేపాల్ (ఖాట్మండు) గుండా 2022 నవంబర్లో అక్రమంగా భారత్కు రప్పించారు. అక్కడి నుంచి కిషన్బాగ్కు తీసుకొచ్చారు. అనంతరం మహ్మద్ ఫయాజ్ను తమ కుమారుడు గౌస్గా పేర్కొంటూ జుబేర్ షేక్, అఫ్జల్ బేగంలు మాదాపూర్లోని ఆధార్ కేంద్రంలో నమోదు చేయించారు. దీనిపై విశ్వసనీయ సమాచారమందుకున్న బహదూర్పురా పోలీసులు ఫయాజ్ను అరెస్టు చేశారు. నిందితుడు అక్రమంగా దేశంలో చొరబడడంతో పాటు స్థానికతను సృష్టించే ప్రయత్నం చేసిన అత్తామామలపై కూడా కేసు నమోదు చేశారు. అత్తామామలు జుబేర్ షేక్, అఫ్జల్ బేగంలు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి పాక్ పాస్పోర్టు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.