ఓయూ విద్యార్థినికి గవర్నర్ అండ
ABN , First Publish Date - 2023-10-30T03:45:29+05:30 IST
ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జెనెటిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి,
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జెనెటిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, దాతలు లేక గోల్డ్ మెడల్ అందుకోలేకపోతున్న విద్యార్థిని మారుపాక విష్ణువచన వినతిపై గవర్నర్ తమిళిసై స్పందించారు. తన పరిస్థితిపై ఆ విద్యార్థిని వర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. ఈ విషయాన్ని ‘దాతలు లేరు.. గోల్డ్ మెడల్ ఇవ్వం’ అన్న శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. స్పందించిన గవర్నర్.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా, ఎండీ సుచిత్రా ఎల్లాతో మాట్లాడారు. విద్యార్థినికి సాయం అందించాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ నెల 31న జరిగే ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవంలో విష్ణువచన గోల్డ్మెడల్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఎల్లా దంపతులకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.