వడదెబ్బతో ఒకరు.. పిడుగుపాటుకు మరొకరు మృతి
ABN , First Publish Date - 2023-05-26T04:04:58+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అక్కడక్కడ పడిన వానలతో వాతావరణం కొంత చల్లబడింది. అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు

● రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అక్కడక్కడ పడిన వానలతో వాతావరణం కొంత చల్లబడింది. అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వడదెబ్బతో ఒకరు, పిడుగుపాటుకు మరొకరు మృతి చెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశా కార్మికుడు ప్రేమ్లాల్బోయి (35) వడదెబ్బతో బుధవారం అర్ధరాత్రి మరణించాడు. మృతుడికి భార్య అజితాబాయి, ఇద్దరు కుమారులున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్దాపూర్ తండాకు చెందిన వసురాం(26) బుధవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. గురువారం ఉదయం వసురాం కోసం కుటుంబీకులు పొలం వద్ద వెతకగా పిడుగు పాటుకు గురై మరణించినట్లు గమనించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.