Share News

తొలిరోజే విపక్షాల గొంతు నొక్కారు

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:04 AM

శాసనసభ తొలిరోజే విపక్షాల గొంతునొక్కాలని అధికా పార్టీ చూసిందని, పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు.

తొలిరోజే విపక్షాల గొంతు నొక్కారు

అధికార పార్టీ తీరు పూర్తి అప్రజాస్వామికం..

3 నిమిషాల్లో 3సార్లు మైక్‌ కట్‌ చేశారు:హరీశ్‌రావు

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శాసనసభ తొలిరోజే విపక్షాల గొంతునొక్కాలని అధికా పార్టీ చూసిందని, పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. సీఎం ప్రసంగం తర్వాత పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తినా స్పీకర్‌ కనీసం తమవైపు చూడలేదని, పైగా ఇచ్చిన మూడు నిమిషాల సమయంలో మూడుసార్లు మైక్‌ కట్‌ చేశారని విమర్శించారు. సీఎం మాట్లాడాక క్లారిఫికేషన్‌కు అవకాశమివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రైతుబీమా విషయంలో మాట్లాడుతూ సీఎం మాట్లాడుతూ రైతు చనిపోయాక డబ్బు ఇచ్చే అవసరం ఏముందని అన్నారని, ఆయన వ్యాఖ్యలను బట్టిచూస్తే రైతుబీమా పథకాన్ని రద్దు చేస్తామన్నట్లు కనిపిస్తుందన్నారు. శాసనసభలో, సభ వాయిదా పడ్డాక అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద హరీశ్‌ మాట్లాడారు. 39మంది శాసనసభ్యులున్న ప్రతిపక్ష పార్టీకి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఇవ్వకుండా, సభను ఏకపక్షంగా వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిందని ఆరోపించారు.

కాంగ్రె్‌సదే కుటుంబ పార్టీ

కాంగెరస్‌ పార్టీ చరిత్రే కుటంబ నేపథ్యం అని, కానీ వారు ఇవాళ తమపై ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజీవ్‌గాంధీ మరణించాక వందకోట్ల మంది భారతీయుల్లో ఎవరూ దొరకనట్లు సోనియాను అధ్యక్షురాలిగా చేసుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని, అలాంటి వారికి తమ గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మరణిస్తే కనీసం చూడటానికి కూడా కాంగ్రెస్‌ నాయకులు వెళ్లలేదని, పీవీ మృతదేహాన్ని ఉంచడానికి ఢిల్లీలో గుంట జాగా కూడా ఇవ్వకుండా హైదరాబాద్‌కు పంపిన చరిత్ర కాంగ్రె్‌సది అని విమర్శించారు. కానిస్టేబుల్‌ కిష్టయ్య కుటుంబాన్ని చేరదీసి ఆయన కుమార్తెను డాక్టర్‌ చేసింది కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో అడుగడుగునా ఉద్యమాన్ని వ్యతిరేకించింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశించారు. ఆయన పేరే రైఫిల్‌రెడ్డి అని, తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకుని జై తెలంగాణ అని నినదించిన ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని ఆరోపించారు. ఎంతోమందిపై ఉద్యమకేసులు మాఫీ చేశామని, కొన్ని చివరిదశలో ఉన్నాయని, వాటిని బూచీగా చూపిస్తూ అమరులపై ప్రేమ ఉన్నట్టు రేవంత్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి గురించి చర్చపెట్టాలని, సభలోనే సమాధానమిస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టి ఎనిమిదేళ్లయినా కాంగ్రెస్‌ వాళ్లు అనుమతులు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌, టీడీపీ హాయాంలో మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులను పూర్తిచేయలేదని, కానీ తాము మాత్రం పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తిచేసి పాలమూరు పచ్చబడేలా చేశామన్నారు.

రైతులు విషయంలోనూ తప్పుదోవ..

రైతుల ఆదాయం విషయంలోనూ రేవంత్‌ తప్పుదోవ పట్టించేవిధంగా వ్యవహరించారని అన్నారు. నీతిఆయోగ్‌ రిపోర్టు ప్రకారం తెలంగాణ వ్యవసాయ రంగం తలసరి ఆదాయం వృద్ధిలో దశాబ్ద కాలంలో 6.59శాతం వృద్ధితో దేశంలో రెండో స్థానంలో నిలిచిందని, మొదటిస్థానంలో చిన్నరాష్ట్రమైన సిక్కిం ఉందని, పెద్దరాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. వాస్తవాలు ఒకలా ఉంటే, సీఎం సభను పక్కదోవ పట్టించారన్నారు. ధాన్యానికి మద్ధతు ధర రాలేదంటూ సత్యదూరమైన విషయాలు మాట్లాడారని విమర్శించారు. రైతు ఆత్మహత్యల విషయంలోనూ సీఎం తప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారని, నేషనల్‌ క్రైమ్‌రికార్డు బ్యూరో నివేదిక ప్రకారం తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చాయన్నారు.

మా ఎంపీ, ఎమ్మెల్యేను చేర్చుకోలేదా?

తెలంగాణను ఇచ్చింది సోనియా అని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొంటున్నారని, అయితే కేసీఆర్‌ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారని చెప్పారు. పదేళ్ల పాటు రాష్ట్రం ఇవ్వడానికి ఆలస్యం చేయడంతోనే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వాటన్నింటికీ కాంగ్రెస్‌ నేతలే కారణం కాదా? అని ప్రశ్నించారు. సోనియాను బలిదేవత అని ఒకప్పుడు మాట్లాడిన రేవంత్‌కు ఇపుడు ఆమె దేవతగా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక తామేదో వెన్నుపోటు పొడిచామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని, వాస్తవానికి వెన్నుపోటు పొడించింది కాంగ్రెస్‌ పార్టీనేనని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఢిల్లీకి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి తాము హైదరాబాద్‌కు రాకముందే ఎంపీ విజయశాంతిని, మంచిర్యాల ఎమ్మెల్యేను కాంగ్రె్‌సలోకి తీసుకున్నారని చెప్పారు. అందుకే తాము ప్రజల్లోకి వెళ్లామన్నారు. కాగా తాను ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిని చేసింది కాంగ్రేసేనన్న రేవంత్‌ వ్యాఖ్యలపై హరీశ్‌ స్పందించారు. నాడు ఆరు కారణాలతో మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ వల్ల తమకు పదవులు రాలేదని, టీఆర్‌ఎ్‌సతో పొత్తువల్లే, అప్పట్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 04:04 AM