బూతుల నేతలకు పోలింగ్‌ బూత్‌లలోనే బదులివ్వాలి

ABN , First Publish Date - 2023-05-26T04:14:03+05:30 IST

‘రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి. ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులు చట్టసభల్లోనే బూతులు మాట్లాడుతున్న దుస్థితి. అలాంటి బూతుల నేతలకు పోలింగ్‌ బూత్‌లలోనే ప్రజలు

బూతుల నేతలకు పోలింగ్‌ బూత్‌లలోనే బదులివ్వాలి

తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌: వెంకయ్య

మండలి బుద్ధప్రసాద్‌కు ఎన్టీఆర్‌ భాషా సేవ పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి. ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులు చట్టసభల్లోనే బూతులు మాట్లాడుతున్న దుస్థితి. అలాంటి బూతుల నేతలకు పోలింగ్‌ బూత్‌లలోనే ప్రజలు సమాధానం చెప్పాల’ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్న నేతలను ప్రోత్సహించవద్దని ప్రజలకు హితవు పలికారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్‌, నృత్య కిన్నెర సంయుక్త నిర్వహణలో గురువారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు ఎన్టీఆర్‌ భాషా సేవా పురస్కారాన్ని వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని సాధికారికంగా ప్రకటించి, వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుదిశలా చాటిన చెప్పిన నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఊరిలో పంచాయతీ వరకు పాలనా వ్యవహారాలు తెలుగులోనే జరగాలని, అదే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్‌... విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా, దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేటి నేతగా ఎదగడం సామాన్యం కాదన్నారు. కొందరు విపక్ష నేతలతో పాటు తనను ఆయన మంత్రివర్గంలో చేరాలని ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. మండల వ్యవస్థ ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, వెనుకబడిన వర్గాలకు, మహిళలకు రిజర్వేషన్లు, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారని గుర్తుచేశారు.

Updated Date - 2023-05-26T04:14:03+05:30 IST