నిందితుణ్ని కాదు.. బాధితుడిని
ABN , Publish Date - Dec 29 , 2023 | 02:41 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాంహౌ్సలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ అలియాస్ నందు..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రధాన నిందితుడి వ్యాఖ్య
నా ఫోన్ ట్యాప్ చేశారు.. ఆడియోలు బయటపెట్టారు
ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ అధికార దుర్వినియోగం
అప్రూవర్గా మారాలని ముగ్గురు ఐపీఎస్ల ఒత్తిడి
స్వామీజీతో పరిచయం చేయించిందే దాసోజు శ్రవణ్
ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాంహౌ్సలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ అలియాస్ నందు.. తాను బాధితుడిని మాత్రమేనని స్పష్టం చేశారు. దాదాపు ఏడాది తర్వాత ఈ కేసుపై నోరు విప్పిన నందు.. ఇప్పటి వరకు బయటకు రాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున.. కొన్ని విషయాలనే వెల్లడిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఈ కేసులో నేను నిందితుడిని కాదు. బాధితుడిని. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. దక్కన్ కిచెన్ హోటల్ను నిర్వహిస్తున్నాను. ఆ హోటల్ను నేలమట్టం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. నాకు పార్టీలకు అతీతంగా ఏపీ, తెలంగాణకు చెందిన 50 మంది దాకా ఎమ్మెల్యేలు తెలుసు. పైలెట్ రోహిత్ రెడ్డితో ముందు నుంచి పరిచయం ఉంది. ఈ కేసుకు కొంతకాలం ముందే (జూలైలో) సింహయాజితో పరిచయమైంది. ఢిలీకి వెళ్లినప్పుడు స్వామీజీ నాకు రామచంద్ర భారతితో పరిచయం చేయించారు’’ అని ఆయన వివరించారు. తనకు సింహయాజిని పరిచయం చేసింది అప్పటి బీజేపీ నేత(ప్రస్తుతం బీఆర్ఎ్సలో ఉన్నారు) దాసోజు శ్రవణ్ అని తెలిపారు. తనకు దైవభక్తి ఎక్కువ అని, అందుకే ఎవరైనా సమస్యల్లో ఉంటే స్వామీజీల గురించి చెప్పి, వారిని కలవమని చెప్పేవాడినన్నారు. ఆ క్రమంలో పలువురిని సింహయాజి స్వామీజీ వద్దకు పంపానన్నారు.
కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్ విషయాలను తనకు తెలియదని వివరించారు. అడ్వొకేట్ శ్రీనివాస్ ఇంట్లో పూజ ఉందంటే సింహయాజికి విమానం టికెట్ బుక్ చేయించి, పిలిపించానన్నారు. ‘‘పూజ తర్వాత స్వామీజీ మా ఇంట్లో భోజనం చేశారు. ఆ తర్వాత పైలట్ రోహిత్రెడ్డి ఫోన్ చేసి, స్వామీజీని తీసుకురమ్మన్నారు. దాంతో ఫామ్హౌ్సకు వెళ్లాం. మేం మాట్లాడిన ఆడియో టేపులు ఎలా బయటకు వచ్చాయి? మా ఫోన్లను ట్యాప్చేసి, ఆ రికార్డులను బయటపెట్టారు. ట్యాపింగ్ విషయంలో న్యాయపోరాటం చేస్తాను. నా విషయంలో ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోపాటు.. నాపై అనేక కేసులను బనాయించి, ఇబ్బందులకు గురిచేశారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉంటే.. వేర్వేరు కేసుల్లో కస్టడీకి తీసుకుని, విచారించారు. ఆ సమయంలో ముగ్గురు ఐపీఎ్సలు నన్ను అప్రూవర్గా మారాలంటూ బెదిరించారు’’ అని నందు ఆరోపించారు. వేరే కేసులో కస్టడీలోకి తీసుకుంటే.. ఈ విషయాలను ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించానని వివరించారు. ‘‘అంతా అనుకుంటున్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వందల కోట్ల లావాదేవీలేమీ జరగలేదు. కేవలం మునుగోడు ఎన్నికల్లో లబ్ధి కోసమే కుట్రపన్ని కేసు పెట్టారు’’ అని వాపోయారు. ఓ బీఆర్ఎస్ నేత తన రూ.80 లక్షల కారును తీసుకుని, తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. దక్కన్ కిచెన్ వల్ల ఆర్థికంగా నష్టపోయానని చెప్పారు.