ఉద్యోగులకు త్వరలో కొత్త పీఆర్సీ

ABN , First Publish Date - 2023-09-28T03:30:08+05:30 IST

ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ వేయనుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను పెంచుతామని చెప్పారు.

ఉద్యోగులకు త్వరలో కొత్త పీఆర్సీ

అంగన్వాడీ టీచర్లకు వేతనాలను పెంచుతాం

బీజేపీ లేవదు.. కాంగ్రెస్‌ గెలవదు: హరీశ్‌రావు

తాండూరు/తూప్రాన్‌, సెప్టెంబ రు 27 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ వేయనుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను పెంచుతామని చెప్పారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 12 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలకు తెలంగాణలో కంటే తక్కువ వేతనాలు అమలవుతున్నాయన్నారు. గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్‌ వచ్చేదీ లేదు. బీఆర్‌ఎ్‌సకు తిరుగే లేదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ సభలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో హరీశ్‌రావు అసహనానికి లోనయ్యారు. అంగన్‌వాడీ టీచర్లు రాజకీయ ఉచ్చులోకి దిగొద్దని, నిజాయితీగా ఆలోచించాలని కోరారు. త్వరలో రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారని, వారి సభలో నిలదీయాలని సూచించారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం తూప్రాన్‌ పట్టణంలో బుధవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ‘‘మన మ్యానిఫెస్టో ఇంకా బయటకు రాలేదు. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. సీఎం కేసీఆర్‌ తయారు చేస్తున్నారు’’ అని చెప్పారు.

Updated Date - 2023-09-28T03:30:08+05:30 IST