MP Ramulu : బీఆర్ఎస్కు ఎంపీ రాములు గుడ్బై?
ABN , First Publish Date - 2023-12-05T03:04:50+05:30 IST
బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు ఆ పార్టీని వీడాలని నిర్ణయించారా? కాంగ్రె్సలో చేరనున్నారా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. రాములు బీఆర్ఎ్సకు బైబై ..
కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం!
అనుచరులతో మంతనాలు
జరుపుతున్న నాగర్కర్నూలు ఎంపీ
నాగర్కర్నూలు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు ఆ పార్టీని వీడాలని నిర్ణయించారా? కాంగ్రె్సలో చేరనున్నారా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. రాములు బీఆర్ఎ్సకు బైబై చెప్పాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వారంలోగా ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ దిశగా తన అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. నాగర్కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారంలో అధిష్ఠానం తన వాదనను పట్టించుకోలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణగా ఉంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాటలు నమ్మి తన కుమారుడికి జడ్పీ చైర్పర్సన్ దక్కకుండా చేశారని రాములు అసంతృప్తిగా ఉన్నారు. తాను ఎంపీగా కొనసాగుతున్నా, మాటకు విలువనివ్వకపోవడాన్ని రాములు జీర్ణించుకోలేకపోతున్నారు.
అన్ని అర్హతలూ ఉన్న తన కుమారుడికి జడ్పీ చైర్పర్సన్ పదవి ఇవ్వకుండా, జిల్లాకు సంబంధం లేని శాంతకుమారికి ఇవ్వడం తనను కలచివేసిందని ఆయన విలేకర్ల సమావేశంలోనే చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో సైతం జిల్లా ఎమ్మెల్యేలు తనను విస్మరించారని, కనీసం ప్రచారానికి కూడా పిలవకుండా అవమానించారని రాములు తన అనుచరులతో వాపోయినట్లు తెలిసింది. బీఆర్ఎ్సలో తనకు విలువలేని నేపథ్యంలో పార్టీని వీడడమే మంచిదని భావిస్తున్న ఆయన.. వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.