యుద్ధప్రాతిపదికన పనిచేయండి
ABN , First Publish Date - 2023-07-21T03:33:15+05:30 IST
గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీవర్షాల కారణంగా భధ్రాచలం వద్ద నది ఉధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీవర్షాల కారణంగా భధ్రాచలం వద్ద నది ఉధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఈ నేపథ్యంలో అత్యవసర చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోలీసులతో సహా ఆయా శాఖల అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని.. రాష్ట్ర సచివాలయంతోపాటు, కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎ్సకు సూచించారు. గతంలో వరదల సమయంలో సమర్థంగా పనిచేసిన అధికారుల సవలను వినియోగించుకోవాలని సూచించారు. హైద్రాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీ్పను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.