కారును కాల్చేసిన మస్కిటో కాయిల్‌

ABN , First Publish Date - 2023-03-26T02:32:24+05:30 IST

దోమల నివారణ కోసం కారులో వెలిగించిన మస్కిటో కాయిల్‌ వాహనాన్ని బుగ్గి చేసింది.

కారును కాల్చేసిన మస్కిటో కాయిల్‌

వాహనంలో నిద్రిస్తున్న వాచ్‌మన్‌ సజీవ దహనం

మంగళ్‌ హాట్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): దోమల నివారణ కోసం కారులో వెలిగించిన మస్కిటో కాయిల్‌ వాహనాన్ని బుగ్గి చేసింది. కారు సీట్లకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగడంతో.. అందులో నిద్రిస్తున్న వాచ్‌మన్‌ సజీవ దహనమయ్యాడు. కింగ్‌ కోఠిలోని కామినేని ఆస్పత్రి పక్కనే ఉన్న కారు షెడ్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. షెడ్‌కు కాపలాగా ఉండే సంతోష్‌ రిపేర్‌ కోసం వచ్చిన 1996 నాటి బెంజ్‌ కారులో శుక్రవారం రాత్రి నిద్రపోయాడు. దోమలు కుడుతుండటంతో కారు డోర్లు తెరిచి ఓ మస్కిటో కాయిల్‌ను వెలిగించి నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 3..30 గంటల సమయంలో కారులో మంటలు చెలరేగడంతో సంతోష్‌ మంటల్లో చిక్కుకొని, పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో మూడు కార్లకు మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఎగసిపడటంతో కామినేని ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

Updated Date - 2023-03-26T02:32:24+05:30 IST