దేశంలోనే అతిపెద్ద కేన్సర్ ఆస్పత్రి ‘ఎంఎన్జే’: మంత్రి హరీశ్
ABN , First Publish Date - 2023-09-20T04:10:10+05:30 IST
దేశంలోనే అతి పెద్ద కేన్సర్ ఆస్పత్రిగా రికార్డు స్థాయిలో 750 పడకలతో ఎంఎన్జే ఆస్పత్రి సేవలందిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతి పెద్ద కేన్సర్ ఆస్పత్రిగా రికార్డు స్థాయిలో 750 పడకలతో ఎంఎన్జే ఆస్పత్రి సేవలందిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎంఎన్జే కేన్సర్ సంస్థలో అధునాతన లాప్రోస్కోపిక్ పరికరాలను, రోబోటిక్ సర్జికల్ వ్యవస్థను ఆయన సోమవారం ప్రారంభించారు. ఆస్పత్రిని రూ. 120 కోట్ల కేన్సర్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ‘‘ఇక దేశంలోనే తొలిసారిగా ఎంఎన్జే అధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ను త్వరలో ప్రారంభించనున్నాం. ఇప్పుడు ప్రారంభించిన అధునాతన రోబోటిక్ సర్జికల్ వ్యవస్థ విలువ రూ. 32 కోట్లు కాగా.. లాప్రోస్కోపిక్ పరికరాల విలువ 50 లక్షల వరకూ ఉంటుంది. ఇప్పటికే 8 అధునాతన మాడ్యులర్ థియేటర్లను ప్రారంభించాం. నిమ్స్, ఎంఎన్జేలో ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా రూ. 25 లక్షల విలువైన ఎముక మూలుగ మార్పిడి శస్త్ర చికిత్సల్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు.