Minister KTR : నాన్న రాజీనామాతో.. అమెరికా వీడా!
ABN , First Publish Date - 2023-03-30T03:22:41+05:30 IST
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో మా నాయకుడు కేసీఆర్ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పుడు అమెరికాలో ఉన్న నేను ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా హైదరాబాద్ వచ్చేశా.
అలా రాజకీయాల్లో 17 ఏళ్లు గడిచిపోయాయి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలి
వారి కోసం నా సీటునూ వదులుకుంటా
దిశ ఎన్కౌంటర్ తప్పే.. కొన్నిసార్లు అలా జరిగిపోతుంది
ప్రజలు న్యాయవ్యవస్థపైనా నమ్మకం లేదంటున్నారు
స్టాండప్ కమెడియన్ కునాల్ ఇంటర్వ్యూలో కేటీఆర్
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో మా నాయకుడు కేసీఆర్ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పుడు అమెరికాలో ఉన్న నేను ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా హైదరాబాద్ వచ్చేశా. ఉపఎన్నికల్లో నాన్న విజయం కోసం నా వంతుగా చిన్న సహకారం అందించా’’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. అలా మొదలైన తన రాజకీయ జీవితంలో 17 ఏళ్లు గడిచిపోయాయని చెప్పారు. ప్రముఖ హిందీ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. దిశ ఎన్కౌంటర్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మజ్లి్సతో దోస్తీ.. ఇలా అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
దిశ ఎన్కౌంటర్ నకిలీదని సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సమంజసం?
మానవ హక్కుల సంఘాలు దీన్ని ఖండిస్తున్నాయి. కానీ, మైనర్లపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసే మానవ మృగాల గురించి హక్కుల నేతలు ఎందుకు మాట్లాడరు? కమిషన్ తప్పు అని చెప్పిందంటే తప్పు తప్పే. కొన్నిసార్లు అలా జరిగిపోతుంది. వాటిని మేం కూడా ఇష్టపడం. 2019 నాటి ఈ ఒక్క సంఘటన గురించే మాట్లాడుతున్నారు. కానీ, గత తొమ్మిదేళ్లలో ఎంతోమంది నేరస్థులకు చట్టపరంగా శిక్షలు పడేలా చేశాం. ప్రస్తుతం అన్ని వ్యవస్థలు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. న్యాయవ్యవస్థపైనా నమ్మకం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికీ కొందరు జడ్జిలు నిజాయితీగా పనిచేస్తున్నారు. అలాంటి వారు ఉన్నందునే న్యాయవ్యవస్థపై ఇంకా ఎంతో కొంత నమ్మకం ఉంది.
చట్టసభల్లో మహిళలకు 33% ఎప్పుడు?
ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 17 మంది మంత్రులుంటే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. 119 మంది ఎమ్మెల్యేల్లో మహిళలు కేవలం ఆరుగురే ఉన్నారు. శాసనసభలో మహిళలకు సీట్లు తక్కువ అని అంగీకరిస్తా. ఎక్కువ మంది మహిళలకు ఇచ్చామని చెప్పట్లేదు. అలా ఇచ్చి, వారు ఓడిపోతే..? ఈ రోజు ఇలా మీరు నాతో మాట్లాడరు కదా..? రాష్ట్రంలో జిల్లాపరిషత్, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తెచ్చాం. శాసనసభలోనూ 33 శాతం రిజర్వేషన్లు అమలు కావాలని నిజాయితీగా కోరుకుంటున్నా. నా స్థానం మహిళకు ఇచ్చినా వదులుకునేందుకు సిద్ధం. భవిష్యత్తులో 119 స్థానాల్లో 40 కంటే అధికంగా మహిళా ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకుంటున్నా.
ప్రజల ఫోన్లను పోలీసులు తనిఖీ చేయడమేంటి?
అది ఒక డ్రైవ్లోనే జరిగింది. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అలా చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. ప్రజల గోప్యతకు కట్టుబడి ఉన్నాం. నేరాలను తగ్గించేందుకు 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టాం. వాటితోనూ ప్రజల గోప్యతకు భంగం ఉందంటున్నారు. కానీ, వీటి వల్ల గొలుగు దొంగతనాలు, నేరాలు చాలా వరకు తగ్గాయి.
మజ్లిస్తో మీ పార్టీ దోస్తీపై..?
రాజకీయ పార్టీ అన్నాక ఎవరి సిద్ధాంతాలు వారికుంటాయి. బీఆర్ఎస్, మజ్లిస్ అభిప్రాయాలు వేరు. వాళ్లతో ముస్లిం ఓట్లు చీలుతాయి, ఇతరులకు లాభం కలుగుతుందన్న ఆరోపణలను నేను నమ్మను. దేశంలో రాజకీయాల్లో ఉండాలంటే ప్రతి పార్టీ తన అస్తిత్వాన్ని, తన బలాన్ని నిరూపించుకోవాల్సిందే.