ఆర్టీసీ విలీనం.. స్థలాలను అమ్ముకోవడానికే

ABN , First Publish Date - 2023-08-02T04:07:47+05:30 IST

రాష్ట్రంలోని బస్సు డిపోల స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకునేందుకే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని క్యాబినెట్‌..

ఆర్టీసీ విలీనం.. స్థలాలను అమ్ముకోవడానికే

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బస్సు డిపోల స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకునేందుకే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని క్యాబినెట్‌.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరోపించారు. ఆర్టీసీని విలీనం చేస్తే, ఆ సంస్థ స్థలాలు, పెట్రోలు బంకులను అమ్ముకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు మునుగోడు ఉపఎన్నిక, మహారాష్ట్ర రాజకీయంపై ఉన్న శ్రద్ధ మోరంచపల్లి వరదబాధితులపై లేదని విమర్శించారు. వరదల్లో మోరంచపల్లి ప్రజలు ప్రాణాలు కోల్పోతే వెళ్లని కేసీఆర్‌.. తన అన్న కొడుకు ప్రమోషన్‌ కోసం మహారాష్ట్రకు వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌ ప్రత్యేక విమాన ఖర్చులతో మోరంచపల్లిలో వరద బాధితులకు మూడు నాలుగు రోజుల పాటు భోజనం పెట్టవచ్చన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించిన కేసీఆర్‌, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు అలా చేయడం లేదని రఘునందన్‌రావు నిలదీశారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.500కోట్ల సాయం ఏ మూలకూ సరిపోదని, రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టమే రూ.1500కోట్ల మేర ఉంటుందని రఘునందన్‌రావు అన్నారు. వరద బాధితులకు అండగా బీజేపీ ఎమ్మెల్యేలు ఒక నెల వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తొమ్మిదేళ్లలో పాతబస్తీలో 5.5 కి.మీ.లు కూడా పూర్తికాని మెట్రో.. రూ.60వేల కోట్లతో 278 కి.మీ.ల మేర నాలుగేళ్లలో ఎలా సాధ్యమని మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే ఈ ప్రతిపాదన అని రఘునందన్‌రావు ఆరోపించారు.

Updated Date - 2023-08-02T04:07:47+05:30 IST