ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుదాం
ABN , Publish Date - Dec 30 , 2023 | 03:26 AM
ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుదామని, కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో పనిచేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పార్టీ నేతలతో అన్నారు.
అన్ని పథకాలకూ దరఖాస్తు చేయించండి
బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్
సిరిసిల్ల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుదామని, కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో పనిచేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పార్టీ నేతలతో అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయ భవనంలో బీఆర్ఎ్సకు చెందిన మునిసిపల్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉందామని, కౌన్సిలర్లు అందరూ జనంలో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేసే వరకు, ఫథకాలు అందరికీ చేరేవరకు పోరాడుదామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరితో అన్ని పథకాలకు దరఖాస్తు చేయించాలని సూచించారు. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించాలన్నారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని, ఏదైనా సమస్య వస్తే నేరుగా వస్తానని చెప్పారు. కొత్త బస్సులు పెంచాలని, సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇతర ఆర్డర్లు ఇవ్వాలని తీర్మానాలు చేయాలని ఆయన సూచించారు.