బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌ ప్రారంభించిన దావత్-ఎ-రంజాన్ ఎక్స్‌పో

ABN , First Publish Date - 2023-04-09T00:30:41+05:30 IST

రంజాన్ పర్వదినం నేపథ్యంలో ‘దావత్-ఎ-రంజాన్’ పేరుతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో..

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌ ప్రారంభించిన దావత్-ఎ-రంజాన్ ఎక్స్‌పో

హైదరాబాద్: రంజాన్ పర్వదినం నేపథ్యంలో ‘దావత్-ఎ-రంజాన్’ పేరుతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్‌లో 14రోజుల పాటు ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తాజాగా ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శనలో పిల్లలు, మహిళలతో పాటు అన్ని వయస్సులవారు ఇష్టపడే ఫ్యాషన్ దుస్తులతో పాటు.. రంజాన్ పండగకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువుల స్టాల్స్ ఏర్పాట్లు చేశారు. 7 ఏప్రిల్ 2023 నుంచి 21 ఏప్రిల్ 2023 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది.

అబండెన్స్ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో అనమ్ మీర్జా, ఆమె భర్త క్రికెటర్/లాయర్ అయిన అసదుద్దీన్ మొహద్‌(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మొహద్ కుమారుడు)తో కలిసి రెండో సంవత్సరం ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్‌లోని అతిపెద్ద ఎక్స్‌పో అయిన దావత్-ఎ-రంజాన్ ఈవెంట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కరిష్మా కపూర్ అన్నారు. హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం, చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్‌కి వచ్చాను, హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌ రుచులను ఎంతగానో ప్రేమిస్తానని అన్నారు. ప్రదర్శనలో భాగంగా అనేక రకాల స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ మరియు సరదాతో కూడిన అతిపెద్ద ప్రదర్శనగా ఇది నిలుస్తుందని ఆనం మీర్జా అన్నారు.

“నేను హైదరాబాదీని.. రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైన ఈ 14 రోజుల ప్రదర్శనను నగర వాసులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉన్న ఓల్డ్ సిటీలో ఈ ప్రదర్శనను తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉందని” ఆనం మీర్జా అన్నారు. దావత్-ఇ-రంజాన్ వేదిక భాగస్వామి అయిన అబండెన్స్ రీజినల్ హెడ్ మిస్టర్ జాకీ జియావుద్దీన్ అలీ మాట్లాడుతూ.. ఈ రకమైన ఈవెంట్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు చాలా గొప్పగా ఉందన్నారు. అబండెన్స్ మరియు దావత్-ఎ-రంజాన్ మధ్య భాగస్వామ్యం సుస్థిరత మరియు పండుగ స్ఫూర్తి మధ్య సంబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుందని అన్నారు.

Updated Date - 2023-04-09T00:41:00+05:30 IST