కొడంగల్ అభివృద్ధికి ‘కడా’
ABN , Publish Date - Dec 31 , 2023 | 03:09 AM
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
రేవంత్ సొంత నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అథారిటీ
కడా చైర్మన్గా వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
స్పెషలాఫీసర్గా కుంచాల వెంకట్రెడ్డి
హైదరాబాద్/వికారాబాద్/కొడంగల్,, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం ప్రభుత్వం కొడంగల్ ఏరియా డెవల్పమెంట్ అథారిటీ (కడా)’ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ హెడ్క్వార్టర్గా, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లోని కొడంగల్ నియోజకవర్గం పూర్తిగా కవరయ్యేటట్లు ఈ ‘కడా’ను ఏర్పాటు చేశారు. దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చైర్మన్గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి కుంచాల వెంకట్రెడ్డిని నియమిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ మరో జీవోను జారీ చేశారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఉన్న వెంకట్రెడ్డిని బదిలీ చేసి, డిప్యుటేషన్పై స్పెషలాఫీసర్గా ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ పర్యవేక్షణలో ‘కడా’ బాధ్యతలను ఈయన నిర్వహిస్తారు. వీరి పర్యవేక్షణలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఓ మాస్టర్ ప్లాన్ను కూడా తయారు చేస్తారు. ‘కడా’ చేపట్టే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రణాళిక శాఖ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తుంది. నోడల్ శాఖగా వ్యవహరించే ప్రణాళిక విభాగం అధికారులు కడాకు కొత్త పోస్టుల మంజూరు, బడ్జెట్ సమకూర్చడం వంటి వ్యవహారాల్లో ఆర్థిక శాఖతో సంప్రదించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కొడంగల్ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కడా పనిచేయనుంది. దీని ద్వారా.. సీసీ రోడ్లు, సీసీ సైడ్డ్రైన్లు, నీటి సరఫరా పథకాలు, విద్యుదీకరణ, వీధి దీపాల ఏర్పాటు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో ఆశించిన లక్ష్యాల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించి సామాజిక అభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. నేల (మట్టి), భూగర్భ జలాలు వంటి అన్ని సహజ వనరులు సమర్థవంతంగా వాంఛనీయ స్థాయులకు అందేలా చూడనున్నారు. వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్ధిని సాధించేలా నీటి సంరక్షణ పనులు, పథకాలు అమలు చేయనున్నారు. ప్రాంత అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి దోహదపడే పరిశ్రమలు, ప్రధానంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రోత్సహించనున్నారు. కాగా, కడా ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం ప్రణాళిక శాఖకు అప్పగించింది.
కొడంగల్ అభివృద్ధిపై త్వరలో సీఎం సమీక్ష?
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి త్వరలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గం అవసరాలు, కల్పించాల్సిన కనీస మౌలిక వసతులు, ఉపాధి కల్పన తదితర అంశాలపై నిర్వహించే ఈ సమీక్షకు వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు సమాచారం. కొడంగల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలనే విషయమై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఓ అవగాహనతో ఉన్నట్లు, ఏయే రంగాల్లో అభివృద్ధి చేయవచ్చనే బ్లూప్రింట్ కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గజ్వేల్ కోసం ‘గడా’ ఏర్పాటు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ‘గజ్వేల్ ఏరియా డెవల్పమెంట్ అథారిటీ(గడా)’ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే.. జూన్ 26న ‘గడా’ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి గజ్వేల్ అభివృద్ధి కోసం ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’ కింద నిధులు కేటాయిస్తూ వచ్చారు. ఇలా గజ్వేల్ అభివృద్ధి కోసం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించడంపై అప్పట్లో ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. గజ్వేల్తోపాటు కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల, అల్లుడు హరీశ్ ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు. గతంలో వైస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందుల, కడప జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబట్టారు.