కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

ABN , First Publish Date - 2023-02-05T19:35:19+05:30 IST

ప్రజల డబ్బుతో నిర్మించిన నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ (CM KCR) పుట్టినరోజున ప్రారంభించడం అన్యాయమని.. అంబేడ్కర్‌ (Ambedkar) జయంతి అయిన...

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

హైదరాబాద్‌: ప్రజల డబ్బుతో నిర్మించిన నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ (CM KCR) పుట్టినరోజున ప్రారంభించడం అన్యాయమని.. అంబేడ్కర్‌ (Ambedkar) జయంతి అయిన ఏప్రిల్‌ 14న ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న సచివాలయం (Secretariat) ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరారు. జాతి అభివృద్ధి కోసం పౌరులు చెల్లిస్తున్న పన్నుల సొమ్మును దుర్వియోగం చేస్తూ.. అప్పటికే ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరిట కూల్చి కొత్తది నిర్మించారని పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.610 కోట్లతో కొత్తగా నిర్మించిన భవనాన్ని తన పుట్టినరోజునాడు ప్రారంభించడం ద్వారా సీఎం వ్యక్తిగత ప్రచారం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌లో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), సీఎంవోను ప్రతివాదులుగా చేర్చారు. పిల్ ఇంకా బెంచ్‌ పైకి రాకుండానే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ బర్త్‌డే రోజే ప్రారంభించాలని చూస్తే సచివాలయాన్ని ముట్టడిస్తామని కేఏ పాల్‌ హెచ్చరించారు.

ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల సమయంలో సీఎం కేసీఆర్‌ ఈ నూతన పరిపాలనా భవనాన్ని ఆవిష్కరిస్తారు. ఆయన జన్మదినం రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం. ప్రారంభోత్సవానికి ముందు సీఎం.. వాస్తుపూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర క్రతువులను నిర్వహించనున్నారు. అనంతరం ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌ సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆరో అంతస్తులో నిర్మాణమవుతున్న సీఎం చాంబర్‌కు వెళ్లి, సీలింగ్‌, వుడ్‌ ప్యానెలింగ్‌, తదితర పనులను పరిశీలించారు. పలు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.

Updated Date - 2023-02-05T19:35:21+05:30 IST